టీడిపీలో కొత్త లోల్లి..! పబ్లిక్ అకౌంట్స్ కమిటి పదవి కోసం పబ్లిక్ గా పోటీ పడుతున్న తెలుగు తమ్ముళ్లు
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో తెలుగుదేశం పార్టీకి మరో తలనొప్పి ఎదురైంది. నేతల మద్య ఆ పదవి తీవ్ర పోటీని రగిలిస్తోంది. ప్రతిపక్షానికి దక్కే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) పదవి కోసం టీడిపి ఎమ్మెల్యేలు వివాదాలకు తెరలేపుతున్నారు. ఈ ఐదేళ్లలో ఎలాంటి పదవులూ ఉండవు. ఉన్న ఆ ఒక్కగానొక్క పదవి పీఏసీ. దీనికి కేబినెట్ హోదా ఉంది. దీంతో, ఈ పదవి కోసం టీడీపీలోని 23మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా సభ్యులు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే అసెంబ్లీలో బలంగా వాదన వినిపించే వాళ్లే కరువయ్యారు. ఒకరో ఇద్దరో ఏదో కొంత మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పదవి కోసం ప్రధానంగా సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ తరుపున వాదన వినిపిస్తున్నది.. అధికార వైసీపీకి కౌంటర్ ఇస్తున్నది బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా వీరిద్దరే మాట్లాడుతున్నారు. పీఏసీ పదవిపై కూడా వీరే ఎక్కువ ఆశలు పెట్టకున్నారు.
ఇక వీరిద్దరి సీనియారిటీని చూస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్. గత ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి కోసం బాగానే ప్రయత్నించారు, దక్కలేదు. దీంతో ఈసారి పీఏసీ పదవి తనకే ఇస్తారన్న నమ్మకంతో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి.. చాలా కాలంగా ఆయన అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. అసెంబ్లీలో కూడా ఏమీ మాట్లాడడం లేదు. అంటే.. అసంతృప్తితో ఉన్న గంటాకు ఈ పదవి ఇస్తారా ? అనే చర్చ కూడా సాగుతోంది.
గంటాకు ఈ పదవి ఇస్తే కాపు సామాజికవర్గాన్ని కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం గత ఐదేళ్లలో కాపులకు చాలా చేసినా వాళ్లు ఓట్లేయలేదని... ఇప్పుడు మాత్రం ఆ వర్గంకు ఈ పదవి ఇస్తే ఉపయోగం ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇందులో ఎవరికి పదవి ఇచ్చినా.. మరొకరు అలకబూనే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.