బీజేపీ ఒక్క సీటు గెలిచినా: కేఈ సవాల్, పవన్కు దమ్ములేదని గంటా ఆగ్రహం
అమరావతి: బీజేపీపై, ప్రధాని మోడీ, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఏపీలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం తిరుపతిలో సవాల్ విసిరారు.
ధర్మపోరాటం విరమించే ప్రసక్తి లేదన్నారు. కేంద్రం సహా ఆంధ్రులను మోసం చేసిన అందరినీ ప్రజల గుండెల్లో ఎండకడతామని చెప్పారు. అవిశ్వాస తీర్మానంలో ప్రధాని అవాస్తవాలు ప్రస్తావించారన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పడం సరికాదన్నారు. ప్రధాని అలా అనడం అన్యాయమన్నారు.
అవాస్తవ హామీలతో మమ్మల్ని మోసగించి ఇలా విమర్శించడం దారుణం అన్నారు. ప్రధాని మోడీయే యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి హోదా కోసం ఎంతదూరమైనా వెళ్తామన్నారు.
అవిశ్వాసం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యంగా మాట్లాడారని మంత్రి గంటా శ్రీనివాస రావు మండిపడ్డారు. అవిశ్వాసాన్ని ఓ కేంద్రమంత్రి వన్డే మ్యాచ్తో పోల్చారన్నారు. పార్లమెంటు వేదికగా ప్రధాని అవాస్తవాలు చెప్పారన్నారు. బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబుకు రాష్ట్ర ప్రజలు ముఖ్యమని, అదే ఆయన నైతిక బాధ్యత అన్నారు.
దేశ ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి బీజేపీకి వచ్చిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ ఎన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోయిందో గుర్తించాలన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని హోదా నుంచి దిగజారేలా మాట్లాడారని విమర్శించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో లాలూచీ పడుతూ ఏపీలో బందులు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు లేవన్నారు. పార్లమెంటు వేదికగా ప్రధాని అవాస్తవాలు చెప్పారన్నారు.