ఐటీ దాడుల పేరుతో కేంద్రం గేమ్, కేసీఆర్ అదుపులో ఉండు: టీడీపీ మూకుమ్మడి దాడి
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాడిన భాష చూస్తుంటే అసహ్యం వేస్తోందని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ శుక్రవారం అన్నారు. ఏడు మండలాల విలీనం విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Recommended Video
చంద్రబాబుపై మహా కుట్ర జరుగుతోందని మరో టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. కేసీఆర్, పవన్ కళ్యాణ్, జగన్లు ప్రధాని మోడీతో భాగస్వామి అయ్యారని ఆరోపించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ను అధోగతి పాలుచేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
ఐటీ దాడుల పేరుతో కేంద్రం గేమ్
కేంద్రం ఐటీ దాడుల పేరుతో మైండ్ గేమ్ ఆడుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలలోనే ఐటీ సోదాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థలు ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని ఎద్దేవా చేశారు. మోడీ బెదిరింపులకు భయపడేది లేదని చెప్పారు. కేంద్రం రాజకీయ కక్షతోనే ఏపీలో ఐటీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా తట్టుకుంటాం
అధికార దుర్వినియోగంలో మోడీ ప్రభుత్వం ముందజలో ఉందని రవీంద్రబాబు విమర్శించారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష పట్ల నిలదీస్తున్నందునే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, భయభ్రాంతులకు గురిచేసినా తట్టుకుని నిలబడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం పెద్దలు ఇలాంటి చర్యలు మానుకుంటే మంచిదన్నారు.
బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం కుట్రలో భాగమే
కార్పోరేట్ సంస్థల్లో ఐటీ సోదాలు చేసి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని రవీంద్ర బాబు విమర్శించారు. ప్రత్యర్థులపై పగ తీర్చుకునే చర్యల్లో భాగంగా కోర్టులను వాడుకునేందుకు కూడా వెనకాడటం లేదన్నారు. బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం ఇందులో భాగమే అన్నారు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు.
మాకు సమాచారం లేదు
ఐటీ దాడులతో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి నారాయణ ఆరోపించారు. కర్ణాటక, తమిళనాడులలోను ఎన్నికలకు ముందు ఇలాగే ఐటీ దాడులతో లొంగదీసుకోవాలని చూశారని ఆరోపించారు. ఏపీలోను ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.