జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తారా?...మీకు నచ్చకపోతే లేపేస్తారా?:టిడిపి నేతల ధ్వజం
Recommended Video
అమరావతి:ఒక అధికారిని బెదిరించే సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం కొనసాగుతోంది. వసంత నాగేశ్వరరావు హెచ్చరికలపై సిఎం చంద్రబాబుతో సహా టిడిపి నేతలు మండిపడుతున్నారు.
వసంత నాగేశ్వరరావు గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి బెదిరించిన సంఘటన, దేవినేని ఉమా గురించి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. సోమవారం అసెంబ్లీ వ్యూహ రచన కమిటీతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సిఎం చంద్రబాబు వసంత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ 'లేపేయడం ఏమిటి? మీకు నచ్చకపోతే.. ఎదురు నిలిస్తే లేపేస్తారా? ...అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు...ఏమన్నారంటే?
సిఎం చంద్రబాబు ఈ విషయమై మాట్లాడుతూ..."కడప నుంచి మనుషులను తెప్పిస్తామని బెదిరిస్తున్నారు...గతంలో విశాఖలో ఇలాగే వ్యవహరించారు. ఈసారి రాజధానిలో మొదలు పెట్టారా?...వీళ్ల మాటలు, చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు.. ఎలాంటి తీర్పు ఇవ్వాలో వారికి బాగా తెలుసు"...అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రి ఉమను అసెంబ్లీలో జగన్ చూడదలచుకోలేదని అంటున్నారని, అలా అనుకోవడానికి ఆయన ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయనకు ఇష్టం లేకపోతే అసెంబ్లీకి రాలేరా అని నిలదీశారు. అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా బెదిరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
వ్యతిరేకిస్తే...చంపేస్తారా?
మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ కూడా వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలను ఖండించారు. జగన్కు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తారా?...అని అసెంబ్లీ మీడియా పాయింట్లో నిలదీశారు. మంత్రి దేవినేని ఉమకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని వసంత మాటలతో స్పష్టమైందని...కాబట్టి వెంటనే మంత్రికి తగిన రక్షణ కల్పించాలని రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.
మంత్రి ఆది...స్పందన
వసంత నాగేశ్వరరావు బెదిరింపులపై కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ లాబీలో ఈ విషయమై మాట్లాడుతూ "కడప ప్రజలు పౌరుషవంతులని...వారు ఎవరి కోసమో వెళ్లి మర్డర్లు చేసే కూలి జనం కాదని వ్యాఖ్యానించారు. జగన్కు సొంత జనం ఉంటే వారితో అలాంటి పనులు చేయించుకుంటారేమో కాని కడప ప్రజలకు అటువంటి ఖర్మ పట్టలేదన్నారు. కడప వాసులు సున్నిత మనస్కులని...మంచివారని చెప్పారు.
సీబీసీఐడీ...విచారణ జరపాలి
ప్రతిపక్ష వైసీపీ అరాచకాలపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి దేవినేని ఉమాను ఉద్దేశించి వసంత నాగేశ్వరరావు చేసిన హెచ్చరికలను ఆయన సోమవారం శాసనసభ జీరో అవర్లో ప్రస్తావించారు. అంతకుముందు అసెంబ్లీ వ్యూహ రచన కమిటీతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సిఎం చంద్రబాబును ఒక ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై సీబీసీఐడీ దర్యాప్తు జరిపించాలని కోరగా అసెంబ్లీలో చర్చించి దానిని బట్టి ఆలోచిద్దామని సీఎం బదులివ్వడం జరిగింది. మరోవైపు వసంత నాగేశ్వరరావు పై ఈ బెదిరింపులకు సంబంధించి ఇప్పటికే పోలీస్ కేస్ నమోదైన సంగతి తెలిసిందే.