పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ .. కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం వార్నింగ్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో దాడులు , దౌర్జన్యాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. ఇక ఎన్నికల నామినేషన్ల దాఖలు వ్యవహారంలో మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేతలు బోండా ఉమా , బుద్దా వెంకన్నల కారుపై కొందరు దాడులు చేయడం, రాడ్లతో కార్ల అద్దాలు పగలగొట్టటంతో పోలీసుల పాత్రపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న పలు ఘటనలు పోలీసుల తీరును చెప్పకనే చెప్తుంది. ఇక ఈ నేపధ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, బీహార్ కంటే దారుణంగా పరిస్థితి ఉందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులు వైసీపీ సర్కార్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు పోలీసుల తీరుపై అటు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళారు.
ఇండియన్ పోలీస్ సర్వీసా? జగన్ పోలీస్ సర్వీసా?: జగన్ కు పంచుమర్తి పంచ్
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు
రాష్ట్రంలో అరాచక పాలనకు కొందరు పోలీసులు సహకారం అందిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇక మాచర్ల ఘటనపై బుద్దా వెంకన్న , బోండా ఉమాలు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని , అయినా పోలీసులు రక్షణ కల్పించటంలో విఫలం అయ్యారని పేర్కొన్నారు. ఇక ఈ నేపధ్యంలో టీడీపీ నేతలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీడీపీ నేతల ఆరోపణలపై రియాక్ట్ అయిన పోలీసు అధికారుల సంఘం
మాచర్ల ఘటన విషయంలో పోలీసులు, జగన్ సర్కార్పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో తాజాగా పోలీసు అధికారుల సంఘం రియాక్ట్ అయ్యింది.ఇక మాచర్ల ఘటన రోజు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని బోండా ఉమ, బుద్దా వెంకన్న అబద్ధాలు చెబుతున్నారని వారు మండిపడ్డారు. దాడి సమాచారం రాగానే డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ నేతలను కాపాడారని చెప్పిన పోలీసు అధికారుల సంఘం నేతలు మా ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడామని చెప్పుకొచ్చారు .
మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతాం
ప్రాణాలు కాపాడిన పోలీసులనే నిందించడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమపై దాడి జరిగిందని రిపోర్ట్ ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు . సుమోటోగా కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు .శాంతి భాదరతల పరిరక్షణ కోసం పని చేసే పోలీసులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తేల్చి చెప్పిన పోలీసులు మీపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . టీడీపీ నేతలకు పోలీస్ అధికారుల సంఘం ఈ వ్యవహారంలో హెచ్చరికలు జారీ చేసింది.