సిఎంగా జగన్ ను ఎపి ప్రజలు కోరుకుంటున్నారా?...సర్వేపై మండిపడ్డ టిడిపి నేతలు
అమరావతి: ప్రతిపక్ష నేత జగన్ ని ఏపి ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని సర్వేలో తేలిందంటూ ఇండియా టుడే ఛానల్ లో వార్తలు ప్రసారం కావడంపై తెలుగుదేశం పార్టీ మండిపడింది.
బిజెపితో కలిసి నాటకాలు ఆడుతున్న జగన్కు ఏమి అనుభవం ఉందని, రాష్ట్రానికి ఏమి చేశారని ఆయనను ఎపి ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటారని సిఎం చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఎచ్చెర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బిజెపి,వైసిపిలపై మండిపడ్డారు. ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ కేంద్రం తప్పుడు సర్వేలు చేయిస్తోందని మండిపడ్డారు.
ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ అనుకూల ఛానెల్స్ ద్వారా తప్పుడు సర్వేలు చేయిస్తోందని ఆరోపించారు. ఒకే సంస్థ రెండు నెలల వ్యవధిలో రెండు రకాలుగా తప్పుడు సర్వే ఫలితాలను విడుదల చేసిందని దుయ్యబట్టారు.
ఇదే యాక్సిస్ సంస్థ కర్ణాటకలో సర్వే చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చాయో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అలాగే ఇదే సంస్థ గత జూలై లో నిర్వహించిన సర్వేలో 45 శాతం మంది ఓటర్లు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని నివేదిక ఇచ్చిందని కుటుంబరావు గుర్తు చేసారు. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 104 పథకాలు అమలు చేస్తోందని, వాటి అమలు పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనే విషయమై ఇండియా టుడే సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో వైసీపీకి ఓటేస్తామని రాష్ట్రవ్యాప్తంగా 43 శాతం మంది...అధికార పార్టీ తెలుగుదేశానికి ఓటేస్తామని 38 శాతం మంది వెల్లడించినట్లు సర్వేలో తేలినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అలాగే చంద్రబాబు సర్కారుపై 33 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా...బాగోలేదంటూ 36 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సీఎంగా జగన్ కావాలంటూ 40 నుంచి 41 శాతం కోరగా చంద్రబాబుకే తిరిగి అవకాశం కల్పించాలని.. 39 నుంచి 40 శాతం మంది అభిప్రాయాన్ని వెల్లడించారని సర్వేలో తేలినట్లు పేర్కొన్నారు.