జగన్ నోట మోడీ మాట: కళా వెంకట్రావు,పవన్ కల్యాణ్ విషం: బుద్ధా వెంకన్న
Recommended Video
అమరావతి: వైసిపి అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై టిడిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాపు రిజర్వేన్లపై ప్రకటనతో జగన్ కాపు వ్యతిరేకి అని స్పష్టంగా తేలిపోయిందంటున్న టిడిపి నేతలు అమరావతిని అడ్డుకుంటామన్న పవన్ వ్యాఖ్యలను దుయ్యబడుతున్నారు.
కాపులకు అన్యాయం చేసే నైజం వైసిపి అధ్యక్షుడు జగన్లో స్పష్టంగా కనిపిస్తోందని...జగన్ అలా కాపులపై ద్వేషం వెళ్లగక్కడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరికలపై స్పందించిన టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటానని, ధర్నా చేస్తానని అంటూ పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
మోడీ దర్శకత్వంలోనే...జగన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దర్శకత్వంలోనే కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. బీజేపీ చెప్పినట్లు నడుస్తున్న జగన్, పవన్లు...కాపు రిజర్వేషన్లపై మోడీని ఒప్పించాలని సవాలు చేశారు. రాజధాని కట్టకుండా చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా అంటున్నారో అర్థం కావడం లేదని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఆ వ్యాఖ్యలు...దారుణం
కాపుల రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్లపై వైసీపీ వైఖరి దీంతో బట్టబయలైపోయిందన్నారు. 2016 ఫిబ్రవరి 1న జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపి షెడ్యూల్-9 లో చేరిస్తే కాపు రిజర్వేషన్ సాధించవచ్చని అప్పుడు చెప్పారని నారాయణ గుర్తుచేశారు. ఇప్పుడు మాట మార్చి కాపు రిజర్వేషన్ అమలు సాధ్యం కాదనడం వెనుక కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు.
వైఖరి...బట్టబయలైంది
కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరి ఏంటనేది ఎట్టకేలకు బట్టబయలైందని టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ విమర్శించారు. జగన్తో ఇంతకాలం అంటకాగిన ముద్రగడ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. మిత్రుడెవరో? శత్రువెవరో?...గుర్తించాలన్నారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామని వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టి మోసం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తూ కాపులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జగన్ కాలర్ పట్టుకుని ముద్రగడ నిలదీయాలన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ సిద్ధాంతాలను జగన్ నెత్తిన పెట్టుకుని కాపుల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
విషం చిమ్ముతున్న...పవన్ కల్యాణ్
రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటానని, ధర్నా చేస్తాననే హెచ్చరికలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే జగన్, పవన్లు విలన్లా అడ్డుపడుతున్నారని బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. ప్రధాని మోడీ, అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్ట్ లనే చదువుతున్న పవన్ మాటలకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని, పవన్ పార్టీకి అయితే అసలు అభ్యర్థులు కూడా దొరకరని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు.