ఎవరు పిలిచారయ్యా?: జగన్ పార్టీ ఎమ్మెల్యే చింతలపై టీడీపీ ఫైర్
పీలేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చిత్తూరు: పీలేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఊపిరి ఉన్నంత వరకూ తాను వైసీపీలోనే కొనసాగుతానని, టీడీపీలోకి చేరే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే, చింతల వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అసలు ఆయనను టీడీపీలోకి రావాలని ఎవరు పిలిచారంటూ ప్రశ్నించారు. చింతలలాంటి అభివృద్ధి నిరోధకులు టీడీపీకి అవసరం లేదని తేల్చి చెప్పారు.
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో జగన్, రోజాలకు మతి భ్రమించిందని, వారిలాగే చింతలకు కూడా మతిభ్రమించిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి చింతల నెల రోజులపాటు నంద్యాలలోనే మకాం వేశారని.. అయినా, సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
చింతల చవకబారు కామెంట్లను మానుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో చింతల ఏ పార్టీ తరపున పోటీ చేసినా, ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కాగా, చింతల టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.