‘పవన్ ప్రతీ ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోంది: జగన్ రాజకీయ ఉగ్రవాది’
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్బాబు, వి. అనిత, కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు.
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్బాబు, వి. అనిత, కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. విశాఖపట్టణంలోని సర్క్యూట్హౌస్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పెట్టుబడిదారుల సదస్సు నిర్వహణ నేపథ్యంలో ఆర్కేబీచ్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరసన తెలపడం సరికాదన్నారు. తాము ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదని, కానీ ఇప్పుడు మాత్రం దానికి సమయం కాదని సూచించారు.
గురువారం ఆర్కేబీచ్లో నిర్వహించనున్నకొవ్వొత్తుల ర్యాలీని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవన్ ప్రతి ఉద్యమానికి ప్రభుత్వం స్పందిస్తోందని, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పవన్ కిడ్నీ బాధితులను పరామర్శించిన అనంతరం అక్కడ డయాలసిస్ పరిశోధన కేంద్రం, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు చేతనైతే ఢిల్లీలో ఆందోళన చేపట్టాలని సవాలు విసిరారు. మోడీని కలిసి హోదాపై నిలదీయాలని సూచించారు. అంతేగానీ రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధిని అడ్డుకోవద్దని నేతలు హితవు పలికారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందు పక్షం రోజులు, తదుపరి పక్షం రోజులు రెడ్అలర్ట్ అమలులో ఉంటుందన్నారు. రిపబ్లిక్ దినోత్సవం సమయంలో ఎటువంటి ఆందోళనలు చేపట్టరాదని, విపక్షనేతకు దీనిపై కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు.
శాంతియుతంగా నిరసన జరుగుతుందని అంటున్నారని, ఒకవేళ అవాంఛనీయ సంఘటనలు జరిగితే జగన్ బాధ్యత వహిస్తాడా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఇటువంటి సమయంలో ఆందోళనలు సరికాదని అన్నారు.
జనవరి 27 నుంచి రెండురోజలపాటు జరగనున్న పెట్టుబడిదారుల సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రేయింబవళ్లూ కష్టపడుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని జగన్పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రలో హింసాత్మక వాతావరణానికి ఆజ్యం పోయవద్దన్నారు.