ఫ్యాన్ల సంగతి సరే! సైకిల్, హస్తం గుర్తులను ఎట్లా తీయించగలరు?
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు పార్టీ నాయకులు చేసిన పని.. సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతోంది. ఆ నాయకులు తెలుగుదేశం పార్టీ వారే కావడంతో రాజకీయ ప్రత్యర్థులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు, అభిమానులు టీడీపీని ట్రోల్ చేస్తున్నారు. చెడుగుడు ఆడుకుంటున్నారు.
ఇంతకీ వారు చేసిన పనేమిటంటే- కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమర్చిన ఫ్యాన్లను తొలగించాలని కోరుతూ తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఫ్యాన్లనే ఎందుకు తొలగించాలని కోరుతున్నారో.. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఫ్యాన్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు. ఫ్యాన్ వేసుకున్నప్పుడల్లా, ఫ్యాన్ ను చూస్తున్నప్పుడల్లా వారికి వైఎస్ఆర్ సీపీ గుర్తుకు వస్తోందట.
మరికొద్దిరోజుల్లో ఎన్నికలు ఉన్నందున.. ఈ ఫ్యాన్లను చూస్తూ, ఓటర్లు ప్రభావితం అవుతారనేది వారి వితండ వాదన. ఫ్యాన్ గుర్తుకు ఎక్కడ ఓట్లు గుద్దేస్తారోననేది వారి భయం. అక్కడిదాకా బాగానే ఉందని అనుకోవచ్చు.
మరి సైకిల్ ను చూసినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ గుర్తుకు రాకుండా ఉంటుందా?, రోడ్లపై సైకిళ్లు తిరక్కుండా చేయాలని కోరుతూ వైఎస్ఆర్ సీపీ నాయకులు కూడా పోటీగా వినతిపత్రం ఇస్తే పరిస్థితేంటీ? సైకిళ్లు రోడ్లెక్కకుండా అడ్డుకోగలరా? అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మధ్యలో హస్తం గుర్తును కూడా లాగుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు హస్తాన్ని ఎలా తొలగించగలుగుతారని నిలదీస్తున్నారు. అరచేతిని నరుక్కుంటారా? రెండు చేతులనూ నరుక్కుంటే ఎలా ఓటు వేస్తారు? అంటూ టీడీపీ నాయకులతో కబడ్డీ అడేస్తున్నారు.