సొంత నేతల షాక్, చంద్రబాబుపై అలక.. చివరికి అందరూ జగన్కు హ్యాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇటీవలి వరకు సొంత నేతల నుంచి షాక్లు తలిగాయి. కానీ ఇప్పుడు అన్నీ సర్దుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇటీవలి వరకు సొంత నేతల నుంచి షాక్లు తలిగాయి. కానీ ఇప్పుడు అన్నీ సర్దుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఆనం వివేకానంద రెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, కర్నూలు జిల్లా నేతలు శిల్పా మోహన్ రెడ్డి.. ఇలా అసంతృప్త నేతలు దారిలోకి వస్తున్నట్లుగా కనిపిస్తోంది.
జనసేనలోకి వెళ్తారని..
చంద్రబాబు తీరుపై ఆనం వివేకానంద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన ఎప్పుడైనా పార్టీ మారవచ్చుననే చర్చ జోరుగా సాగింది. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి ఆయన వెళ్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని, అది నెరవేరకపోవడంతో సైకిల్ దిగుతారని భావించారు.
తేల్చి చెప్పిన ఆనం వివేకా
కానీ రెండు రోజుల క్రితం చంద్రబాబుతో భేటీ అనంతరం ఆనం వివేకా పార్టీ మారడంపై స్పందించారు. తాను పార్టీ మారడం లేదని చెప్పారు. తాను లేదా తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి టిడిపిలోనే కొనసాగుతామని వివేకా స్పష్టం చేశారు.
శిల్పా మోహన్ రెడ్డిపై జోరుగా ప్రచారం
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్ కోసం శిల్పా మోహన్ రెడ్డి, భూమా కుటుంబం పట్టు బడుతున్నాయి. శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకుంటే ఆయన పార్టీ మారుతారని, వైసిపి టిక్కెట్ ఇస్తే అందులో చేరుతారని భావించారు.
శిల్పా యూ టర్న్
రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన శిల్పా మోహన్ రెడ్డి పదిహేను రోజులు దాటుతున్నా.. టిడిపిని వీడలేదు. పైగా టిక్కెట్ పైన చంద్రబాబు నిర్ణయం శిరోధార్యం అంటున్నారు. ఆయనకు టిక్కెట్ పైన హామీ రావడం వల్లే వైసిపిలో చేరే నిర్ణయాన్ని విరమించుకున్నారని అంటున్నారు. భూమా కుటుంబాన్ని బుజ్జగించే పనిలో టిడిపి నేతలు ఉన్నారని చెబుతున్నారు.
వేడి రాజేసిన శివప్రసాద్
ఇక, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గత నెల అంబేడ్కర్ జయంతి రోజున చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చంద్రబాబు మంత్రివర్గంలో దళితులకు సముచిత స్థానం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా టిడిపిని వీడి వైసిపిలో చేరుతారనే ప్రచారం సాగింది.
స్నేహమే గెలిచిందంటూ..
కానీ అనూహ్యంగా ఆయన మూడు రోజుల క్రితం చంద్రబాబును కలిసి, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ స్నేహం కలకాలం ఉంటుందని, తనకు చంద్రబాబు క్లాస్ పీకలేదని, తన అనుమానాలు నివృృత్తి చేసుకున్నానని చెప్పారు.
మోదుగుల వ్యాఖ్యల వెనుక..
మరోవైపు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా చంద్రన్న బీమా పథకంపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలు అధికారుల పైనే తప్ప తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ ఆశలు అడియాస
మొత్తానికి టిడిపిలో ముఖ్య నేతలు అయిన శివప్రసాద్, ఆనం వివేకా, శిల్పా మోహన్ రెడ్డి వంటి నేతలు ఆ పార్టీని వీడుతారా.. వైసిపిలో చేరుతారా అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. కానీ వీరంతా చివరకు జగన్కు హ్యాండిచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే శిల్పా వంటి నేతలు వైసిపి నేతలతో ఫోన్లో మంతనాలు జరిపినట్లుగా కూడా ప్రచారం జరిగింది.