మొన్న రాయపాటి.. నిన్న బుద్ధావెంకన్న- జగన్ పై వ్యాఖ్యలతో బెదిరింపు కాల్స్....
ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. ప్రత్యర్ధులను ఎదుర్కొనే విధానం కూడా మారిపోతోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రత్యర్ధులపై దాడి చేయాలనుకున్న టీడీపీ నేతలకు ఎదురవుతున్న బెదిరింపులే ఇందుకు తార్కాణంగా కనిపిస్తోంది. ఇది ఎంతవరకూ సమర్ధనీయం అన్న ప్రశ్నను పక్కనబెడితే రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం జనంలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
మొన్న రాయపాటి, నిన్న బుద్ధా వెంకన్న...
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు ఉంటాయి. కులాలు, సామాజిక వర్గాల దగ్గర మొదలయ్యే పోరు ఏ స్ధాయిలో వెళ్లిపోతుందో ఎవరూ చెప్పలేని పరిస్ధితి. తాజాగా స్ధానిక ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏం జరిగిందో అంతా చూశారు. అయితే ఇందుకు కొనసాగింపుగా టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తాజాగా వైసీపీకి మంట పుట్టించాయి. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ రాయపాటి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియా విరుచుకుపడింది. దీంతో పాటు బెదిరింపు కాల్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇది జరిగిన 24 గంటల్లోనే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఇదే పరిస్ధితి ఎదురైంది. రోజూ ప్రెస్ మీట్లు, ప్రెస్ మీట్లతో జగన్ పై విరుచుకుపడుతున్న బుద్ధా వెంకన్నకు అపరిచిత కాల్స్ రావడంతో ఆయన డిఫెన్స్ లో పడ్డారు.
బెదిరింపులతో టీడీపీ నేతల్లో భయం...
వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ ను ఉద్దేశించి గతంలోనూ టీడీపీ నేతలు విరుచుకుపడేవారు. కానీ ఇప్పుడు జగన్ మామూలు వ్యక్తి కాదు. విపక్షంలో ఉంటూ ప్రభుత్వం ఏం చేసినా చూస్తూ ఊరుకునే రకమూ కాదు. దీంతో ఆయన అభిమానుల్లో సైతం ఇదే భావన కనిపిస్తోంది. జగన్ ను ఏమన్నా ఊరుకునేది లేదంటూ సామాజిక మాధ్యమాలతోపాటు బహిరంగంగానూ విరుచుకుపడుతున్నారు. తాజాగా పరిస్ధితి బెదిరింపు కాల్స్ వరకూ వెళ్లింది. దీంతో వీరిని ఎదుర్కోవడం టీడీపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. వైసీపీ కార్యకర్తలు, అభిమానుల నుంచి బెదిరింపులు భరించలేక రాయపాటి సాంబశివరావు.. సీనియర్ గా ఓ సలహా ఇచ్చానంతే అంటూ వివరణ ఇస్తే.. ఇప్పుడు బుద్దా వెంకన్న ఏకంగా తనను ఏమైనా చేసే అవకాశం ఉంది కాబట్టి మీడియానే రక్షించాలంటున్నారు.
బెదిరింపులపై సర్వత్రా చర్చ..
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూాడ సోషల్ మీడియా గ్రూపుల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ దూషణల పర్వం కొనసాగేది. ఓ దశలో టీడీపీ సర్కారుపై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వైసీపీ అనుకూల ఐటీ నిపుణులపై సైతం కేసులు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ సీన్. కాకపోతే టీడీపీ అనుకూల వాదులపై కేసులు నమోదవుతున్నాయి. ఇదంతా తెరచాటుగా జరుగుతున్నా.. తాజాగా ఇది కాస్తా బహిరంగమై పోవడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
Recommended Video
బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదులేవీ.. ?
ఏపీలో సీఎం జగన్ ను ఉద్దేశించి తాము చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలను తమను బెదిరిస్తున్నా టీడీపీ నేతలు మాత్రం పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదు. అలాగని పోలీసులు కూడా దీనిపై తమంతట తాముగా స్పందించే పరిస్ధితి లేదు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే కనిపిస్తోంది. బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తే వేధింపులు మరింత పెరుగుతాయన్న భయమే టీడీపీ నేతలను ఆ దిశగా ముందుకు పోనివ్వడం లేదని అర్ధమవుతోంది. అందుకే రాయపాటి తన వ్యాఖ్యలపై వివరణకే పరిమితమైతే.. బుద్ధా వెంకన్న మీడియా సాయం కోరుతున్నారు.