నెల్లూరు లాడ్జిలో ప్రకాశం ఎంపీటీసీలు: 'నా భర్తను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారు'
ఒంగోలు: ఏపీలో స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రెండు పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. తనభర్తకు డబ్బు ఆశచూపి టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డి కిడ్నాప్ చేయించినట్లు తెలిసిందని మద్దిపాడు మండలం ఇనమనమెళ్ళూరు గ్రామ ఎంపిటిసి భార్య యాదాల మేరీ ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం ఒంగోలులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనభర్త యాదాల వెంకట్రావుగత ఎంపిటిసి ఎన్నికల్లో ఇనమనమెళ్ళూరు గ్రామ ఎంపిటిసిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారన్నారు.
హైదరాబాద్లో ఉన్న తన కుమార్తెను చూసి వస్తానని చెప్పి ఈనెల 17న వెళ్లిన అతని నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు. శనివారం ఫోన్లో మాట్లాడుతూ ఆదివారం వస్తానని చెప్పారన్నారు. కాని అప్పటినుండి మాకు పోన్చేయలేదని, ఎమి అయిందో తెలియక తమకుటుంబం అందరు కంగారుగా ఉన్నామన్నారు.
అయితే సోమవారం నెల్లూరు జిల్లాలోని ఓ లాడ్జిలో సుమారు 35మంది ఎంపీటీసీలు ఉన్నట్లు వార్తల్లో కనిపించారన్నారు. వారిలో తన భర్తకూడా ఉన్నాడని ఆమె తెలిపారు. తన భర్తను అక్రమంగా నిర్బంధించి బలవంతంగా తీసుకువెళ్ళినట్లు తెలిసిందన్నారు. ఈవిషయం మొత్తం తెలుగుదేశంపార్టీకి చెందిన అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డి చేయించినట్లు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాగుంటను అనర్హుడిగా ప్రకటించాలి: ఎంపి వైవి సుబ్బారెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఓటర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎన్నికలనుండి అనర్హుడిగా ప్రకటించాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం హరిజవహర్లాల్ను కోరారు.
ఈమేరకు ఆయన్ని మంగళవారం కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. తమపార్టీకి చెందిన ఓటర్లను తమకు అప్పగించాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఓటుకు రెండున్నర లక్షల రూపాయలు ఇస్తామని ఆశచూపి ముందుగా 50వేల రూపాయలు ఇచ్చారని, మిగిలిన నగదు తరువాత ఇస్తామని ప్రలోభపెట్టినట్లు ఇక్కడకు తీసుకువచ్చారని ఓటర్లు తెలిపారని అన్నారు.
ఎన్నికల అధికారిని కలిసిన వారిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఆట్ల చినవెంకటరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ రాష్టజ్రిల్లా నాయకులు కెవి రమణారెడ్డి, వైవి వెంకటేశ్వర్లు, వేమూరి సూర్యనారాయణ ఉన్నారు.