విలువల్లేవ్: మైసూరా, రాజీనామాకి మేకపాటి డిమాండ్
హైదరాబాద్: తమ పార్టీ ఎంపీలు తెలుగుదేశం పార్టీలే చేరడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆదివారం స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి విలేకరులతో మాట్లాడారు. టిడిపి నైతిక విలువలకు విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి తమ పార్టీ ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకోవడంపై కాకుండా మేనిఫెస్టో పైన దృష్టి సారించాలని మైసూరా హితవు పలికారు. తమ పార్టీ గుర్తుతో గెలిచిన వారిని చేర్చుకోవడం టిడిపికి తగదన్నారు. నైతికంగా అది తప్పన్నారు. నైతిక విలువలకు విరుద్ధంగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తమ పార్టీ విప్ తప్పకుండా చెల్లుబాటు అవుతుందన్నారు. పార్టీని ఎవరైనా వీడితే వారికి విప్ వర్తిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఒకరిద్దరు వెళ్లిపోయారని, ఇక ముందు ఎవరు తమ పార్టీని వీడి వెళ్లిపోరని మైసూరా చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు తమ పార్టీ పైన అత్యుత్సాహం చూపిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఒక పార్టీ మీద గెలిచిన అభ్యర్థులను టిడిపి వారు తమ పార్టీలోకి తీసుకోవడం దురదృష్టకరమన్నారు. టిడిపి చేస్తున్న పనులు నైతిక విలువలకు విరుద్ధమని చెప్పారు. తమ పార్టీకి చెందిన మిగతా ప్రజాప్రతినిధులు టిడిపి వైపు వెళ్లరని చెప్పారు.
రాజీనామా చేయాలని మేకపాటి
తమ ఎంపీలు టిడిపిలోకి చేరడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పార్టీలు మారాలనుకునేవారు ముందుగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలని ఎంపీ మేకపాటి సవాల్ విసిరారు. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చాల్సిన సమయంలో... చంద్రబాబు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ టిడిపికి ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు, ఎంపీలతో అవసరమేముందన్నారు.