డీఎస్పీ కాలర్ పట్టుకున్న టీడీపీ నేతలు.. బాహాబాహీ ..గుంటూరులో ఉద్రిక్తత
మూడు రాజధానులకు అసెంబ్లీలో బిల్లుకు ఆమోద ముద్ర పడిన నేపధ్యంలో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని ప్రాంత రైతులు , ప్రజలు ఆగ్రహావేశాల్లో ఉన్నారు.రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన నేడు 36వ రోజు కొనసాగుతుంది. ఇక ఇదే క్రమంలో గుంటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఎస్పీ కాలర్ టీడీపీ నేతలు పట్టుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రాజధాని తరలింపుపై వేదనతో మరో రైతు మృతి .. అమరావతిలో విషాదం
గుంటూరు జిల్లా బంద్ .. కొనసాగుతున్న నిరసనలు
ఇవాళ గుంటూరు జిల్లా బంద్కు అమరావతి జేఏసీ పిలుపు ఇచ్చింది. కానీ బంద్ కు అనుమతి లేదని పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోమని హెచ్చరించారు . అయినా గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగిస్తామని , తమ నిరసన తెలియజేస్తామని చెప్పిన నిరసనకారులు ఈ రోజు గుంటూరులో నిరసనలకు దిగారు. ఒక పక్క బంద్ కొనసాగిస్తూనే మరోపక్క రోడ్డుపైకి వచ్చి రైతులు, విద్యార్థి సంఘాలు, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.
డీఎస్పీ సీతారామయ్య కాలర్ పట్టుకున్న టీడీపీ నేతలు
విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులో నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కళాశాల, పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగటంతో డీఎస్పీ సీతారామయ్య కాలర్ పట్టుకున్నారు టీడీపీ నేతలు.
గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దదైంది .దీంతో బాహాబాహీకి దిగడంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. విధుల్లో ఉన్న డీఎస్పీతో అనుచితంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చెయ్యనున్నారు పోలీసులు . ఇక గుంటూరు బంద్పై పోలీసులు బంద్కు ఎలాంటి అనుమతులు లేవని, బంద్తో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయన్నారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.