కోట్ల అనుచరుడి దారుణహత్య: కౌంటింగ్కు ముందురోజు ఘటన: ఫైనాన్స్ లావాదేవీలే కారణమా?
కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శేఖర్ రెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైక్పై వెళ్తున్న ఆ వ్యాపారిని అడ్డగించి, బండరాయితో తలపై మోది హతమార్చారు. జిల్లాలో డోన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మల్లంపల్లిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపార లావాదేవీల వల్లే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.
హతుడిని శేఖర్ రెడ్డిగా గుర్తించారు. జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనుచరుడని చెబుతున్నారు. డోన్ నియోజకవర్గంలోని కృష్ణగిరి మండలం పాపన్న కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు పోలీసులు.
కొంతకాలంగా శేఖర్ రెడ్డి తన స్వగ్రామంలో నివసించడం లేదు. పొరుగునే ఉన్న అనంతపురం జిల్లా గుంతకల్లులో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ, అక్కడే నివసిస్తున్నారు. ఈ ఉదయం ఆయన గుంతకల్లు నుంచి బైక్పై తన స్వగ్రామం పాపన్న కొత్తూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో మల్లంపల్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే, గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డగించారు. ఘర్షణకు దిగారు. అనంతరం- బండరాయితో శేఖర్ రెడ్డి తలపై మోది హత్య చేశారు.
శేఖర్ రెడ్డి.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనుచరుడు కావడంతో.. ఈ హత్యోదంతం కాస్తా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా రాజకీయ కోణం వైపు దర్యాప్తు సాగించేలా చేస్తోంది. హతుడు శేఖర్ రెడ్డి కోట్లకు అనుచరుడే అయినప్పటికీ.. చాలాకాలం నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచారం చేశారని స్థానికులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.