రోజా మహిళ అని మరిచి..: బొజ్జల, చెన్నైకి అనుకోని ముప్పు: జయప్రద
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తాను మహిళను అనే విషయం మరిచి అర్థంలేని విమర్శలు చేస్తోందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారం సాయంత్రం ఓ బహిరంగ సభలో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న చింతామోహన్ అప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు తిరుపతికి కోర్టు కావాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. విభజన బిల్లులో నాడే దీనిని ఎందుకు పొందుపర్చలేదన్నారు.
టిడిపి నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... అందరూ వారానికి ఓ రోజు గుడి, చర్చి, మసీదులకు వెళ్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వారానికోసారి సిబిఐ కోర్టుకు వెళ్తారని ఎద్దేవా చేశారు. దేశంలో ఇలాంటి నాయకుడు ఎక్కడా లేడన్నారు.
తడిసిన ధాన్యం కొంటాం: పత్తిపాటి
తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేస్తామని మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం హామీ ఇచ్చారు. ఆయన గుంటూరు జిల్లాలో మాట్లాడారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. పంటలను కాపాడుకునేందుకు పొలాల్లోనే నీటి కుంటలు తవ్వాలన్నారు. పనికి ఆహారం పథకం కింద ఐదు లక్షల నీటి కుంటలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
చెన్నైని ఆదుకుంటాం: జయప్రద
ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద గురువారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉదయం విఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల మాట్లాడుతూ... చెన్నైకి అనుకోని ముప్పు వచ్చిందని, చెన్నై వాసులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుకొస్తుంది తెలిపారు.