బాబు పోరాటం తొలి విజయం, దిమ్మతిరిగింది, ప్రచారం చేస్తే బీజేపీకి డిపాజిట్ రాకపోయేది: కర్ణాటకపై టీడీపీ
అమరావతి: జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ మీద పైచేయి సాధించిన నేపథ్యంలో ఏపీ మంత్రులు పలువురు స్పందించారు. బీజేపీకి కర్ణాటకలో భంగపాటు తప్పలేదని, కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు నిజాయితీగా ఉండి బీజేపీకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ నాలుగేళ్లలో ఇందిరా గాంధీ కంటే ఘోరంగా పాపాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. మోడీ - అమిత్ షాల పతనం ప్రారంభమైందని చెప్పారు. ఏపీ విషయంలో కేంద్రం ఇప్పటికైనా దిగి రావాలని డిమాండ్ చేశారు. నియంతృత్వ, నిరంకుశపాలన నుంచి దేశాన్ని కాపాడేందుకు ఇంకా వ్యవస్థలు బతికే ఉన్నాయని సుప్రీం బెంచ్ ఇచ్చిన తీర్పు, కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు రుజువు చేశాయన్నారు.
ఇక చాలు, రాజీనామా చేయండి!: యడ్యూరప్ప తీరుపై అధిష్టానం ఆగ్రహం? రంగంలోకి బీజేపీ పెద్దలు
చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు ఇది తొలి విజయం
తెలుగు ప్రజల ఉసురు వృథా కాలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఓట్ల శాతం తగ్గిందని చెప్పారు. బీజేపీకి ఇప్పటికైనా బుద్ధి రావాలన్నారు. తెలుగు మాట్లాడే వారంతా బీజేపీని చావుదెబ్బకొట్టారని, చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు ఇది తొలి విజయమని, అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూస్తే కర్ణాటక ప్రజలు మట్టి కరిపించారన్నారు. యెడ్డీ శాసనసభలో బోరున ఏడవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం బీజేపీయే అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి అవినీతిపరులను పక్కన చేర్చుకుని ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎరవేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
బీజేపీ క్షమాపణ చెప్పాలని యనమల
కర్ణాటకలో అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు బీజేపీయే బాధ్యత వహించాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మెజార్టీ లేకపోయినప్పటికీ బీజేపీకి గవర్నర్ అవకాశమిచ్చారన్నారు. రాజ్యాంగాన్ని అవమానించినందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలన్నారు. కర్ణాటక అసెంబ్లీలో జాతీయ గీతాన్ని అవమానిస్తారా అని ప్రశ్నించారు. జాతీయ గీతాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. కర్ణాటక గవర్నర్ను రీకాల్ చేయాలన్నారు. మోడీ, అమిత్ షాల సూచనల మేరకే ఆయన అలా వ్యవహరించారన్నారు. బీజేపీకి వచ్చేది గడ్డుకాలమే అన్నారు.
మోడీ, అమిత్ షా ఎత్తులు చిత్తు
బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. కర్ణాటకలో మెజార్టీ లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ - అమిత్ షా అహంభావంతో మాట్లాడారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బీజేపీకి గుణపాఠం అన్నారు. కర్ణాటక తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారన్నారు. ఏపీలో కుట్ర రాజకీయాలు సాగవన్నారు. అశ్వమేధ యాగం ప్రారంభించామన్న బీజేపీ పెద్దల గుర్రానికి కర్ణాటకలో కాళ్లు విరిగాయన్నారు. మోడీ, అమిత్ షాల ఎత్తులు చిత్తయ్యాయన్నారు.
కర్ణాటకలో ప్రచారం చేస్తే బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కేవి కావు
కర్ణాటకలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేసి ఉంటే బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కేవి కాదని మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బందర్ పోర్టును జగన్ తొలి నుంచి అడ్డుకుంటున్నారని చెప్పారు. బలపరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని శిద్ధా రాఘవ రావు అన్నారు. బీజేపీ దౌర్జన్యానికి, బరి తెగింపుకు శాస్తి జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. బీజేపీ చర్యలను న్యాయవ్యవస్థ కూడా సహించలేకపోయిందన్నారు.
ఆ తీర్పుతో బీజేపీ దిమ్మతిరిగింది
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి అధికారం దక్కించుకోవాలని భావించిన బీజేపీకి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో దిమ్మతిరిగిందని, బలనిరూపణలో విఫలమై యడ్యూరప్ప రాజీనామా చేయడంపై మోడీ, అమిత్ షాలు సిగ్గుపడాలని, ఇప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలని ఎంపీ మురళీ మోహన్ అన్నారు. సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టు అని, ఇకనైనా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని, ఏపీకి బీజేపీ చేసిన మోసం కర్ణాటక ఎన్నికల్లో కనిపించిందన్నారు.
బీజేపీ కుయుక్తులు పారలేదు
ప్రజాగ్రహం కారణంగా యెడ్డీ రాజీనామా చేశారని కళా వెంకట్రావు అన్నారు. బీజేపీ కుయుక్తులు సుప్రీం కోర్టు జోక్యంతో పారలేదన్నారు. కర్ణాటకలో అంతిమంగా ప్రజాస్వామ్యమే విజయం సాధించిందని అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీలో బలపరీక్ష జరగబోయే ముందు వరకూ బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని, ఆధిక్యం లేని బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించి గవర్నర్ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు.