చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: సోము వీర్రాజు
తూర్పుగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు ఇతర తెలుగుదేశం నేతలు తమ డ్రామాలను ఇకనైనా ఆపాలని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ కోసం వారు చేస్తున్న దీక్షలు బూటకమని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు అడిగితే స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్లు అసలే ఇవ్వమని సోము వీర్రాజు అన్నారు.
అవినీతిపరులకు దూరంగా ఉండాలని మోడీ ఎప్పుడో చెప్పారని సోము గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పై యుద్ధం చేస్తున్న వారు మూతపడ్డ స్టీల్ ప్లాంట్ను ఎందుకు తెరిపించలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. బీజేపీపై దాడులు, ధర్మపోరాలు ఇకనైనా ఆపాలన్న సోము వీర్రాజు... చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు.
కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు టీడీపీ కంకణం కట్టుకుందని అన్నారు.
ఏపీలో బీజేపీ చేసిన అభివృద్ధి పై చంద్రబాబుతో చర్చకు సిద్ధమని ఇందుకు టీడీపీ సిద్ధమేనా అని సోము వీర్రాజు సవాల్ విసిరారు. అవినీతి పరులకు సహకరించవద్దని మోడీ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సోము వీర్రాజు తెలిపారు.