అచ్చెన్న అరెస్ట్ : జగన్ ది రాక్షసానందమన్న నారా లోకేష్ ; ఆజానుబాహుబలికి భయపడే అంటున్న బుద్ధా
ఏపీ రాజకీయాల్లో అచ్చెన్నాయుడు అరెస్ట్ తో రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈఎస్ఐ కుంభకోణం లో టీడీపీ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో టిడిపి నేతలు అధికార వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీ సమావేశాలలో అచ్చెన్నాయుడుని ఎదుర్కోలేకనే వైసీపీ ఈ తరహా చర్యలకు దిగుతోందని మండిపడుతున్నారు.
కర్మ కాలి జగన్ సీఎం అయ్యారు..ఏడాది పాలన బాగోలేదని మీ వాళ్ళే చెప్తున్నారు :టీడీపీ నేతల ధ్వజం
అచ్చెన్నను అరెస్ట్ చేసిన ఏసీబీ .. మండిపడుతున్న టీడీపీ
టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో రంగంలోకి దిగింది ఏసీబీ. ఇక అందులో భాగంగా ఈఎస్ఐ కుంభకోణంలో టిడిపి నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బయటపెట్టిన నేపధ్యంలో ఇక ఈ స్కామ్ వెనుక టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. టెలీహెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని, అలాగే నామినేషన్ల పద్ధతిలో టెండర్లును కేటాయించాలంటూ అచ్చెన్నాయుడు ఆదేశించినట్లు విజిలెన్స్ రిపోర్టులో తేలింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇక టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
వైసీపీ అరాచకాలు, అక్రమాలు ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్ : నారా లోకేష్
అయితే ఇదంతా వైసీపీ ప్రభుత్వ కక్షపూరితచర్య అని శాసనసభాపక్ష ఉపనేత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వైయస్ జగన్ బీసీ నేత అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయించారు అంటూ పేర్కొన్న లోకేష్ ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను,అన్యాయాన్ని బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడుపై జగన్ పగపట్టాడు అంటూ పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం .. జగన్ ది రాక్షసానందం
ఇక అంతే కాదు బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షసానందం పొందారని పేర్కొన్నారు.లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్క పెట్టిన జగన్ అందర్నీ జైల్లో పెట్టాలి అనుకోవడం సహజమే అంటూ మండిపడ్డారు. ఇక అంతే కాదు రాజారెడ్డి రాజ్యం అమల్లో ఉంది, ఇష్టమొచ్చినట్టు ఎవరినైనా అరెస్టు చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారు. బడుగు,బలహీన వర్గాల రక్షణకి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గారు గుర్తెరిగితే మంచిది అంటూ నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా అచ్చెన్న అరెస్టును ఖండించారు.
151 మంది కాలకేయులు ఆజానుబాహుబలి దెబ్బకు భయపడే ఇదంతా : బుద్ధా వెంకన్న
ఇక బుద్ధా వెంకన్న కూడా అచ్చెన్నాయుడు అరెస్టుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.151 మంది కాలకేయులు ఆజానుబాహుబలి అయిన అచ్చెన్నాయుడుని చూసి భయంతో పారిపోతున్నారు అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలలో అచ్చెన్నను ఎదుర్కొనే దమ్ము లేకనే అక్రమంగా అరెస్టు చేశారంటూ బుద్ధ వెంకన్న వైసీపీ ప్రభుత్వ తీరును,అచ్చెన్నాయుడు అరెస్ట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.