అంబేద్కర్ 'విగ్రహ' రాజకీయం: టీడీపీ నేతల తీరుతో బాలయ్యకు తలనొప్పి
అమరావతి: 'రాజకీయం చేసేందుకు కాదేదీ అనర్హం' అని అన్నారు ఓ పెద్దాయన. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని కూడా రాజకీయనాయకులు రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా హిందూపురంలో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన వైపీసీ నియోజక వర్గ ఇంఛార్జి నవీన్ నిశ్చల్ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు.
అంతేకాదు టీడీపీ నేతలు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలుగకమానదు. హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరుపున సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యే బాలకృష్ణ దండ వేసేంత వరకు ఎవరూ అంబేద్కర్కు దండ వేయకూడదని టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు.
ఈ వితండ వాదనతో నవీన్ నిశ్చల్ టీడీపీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలా మారుతుందని గ్రహించిన హిందూపురం పోలీసులు జోక్యం చేసుకుని నవీన్ నిశ్చల్ను పూలమాల వేయనివ్వడంతో గొడవ సద్దుమణిగింది.
అంబేద్కర్ ఫ్లెక్సీ విషయంలో గొడవ
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరులో అంబేద్కర్ ఫ్లెక్సీ ఏర్పాటు వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. బుధవారం రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత గుమ్మిలేరు సెంటరులో(రావులపాలెం మండపేట రోడ్డులో) ఒక సామాజిక వర్గం ఫ్లెక్సీ పెడుతుండగా మరో సామాజిక వర్గం యువకులు అడ్డుకున్నారు.
దీంతో వివాదం తలెత్తింది. ఈ ఘర్షణలో ఒక సామాజిక వర్గానికి చెందిన ముగ్గురితో పాటు మండపేట రూరల్ పోలీస్టేషన్కి చెందిన కానిస్టేబుల్ తలకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు ఎటువంటి ఘర్షణ తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
పీతల సుజాత మనస్తాపం
దళిత మంత్రి పీతల సుజాత గురువారం తీవ్ర మనస్థాపం చెందారు. విజయవాడలో అంబేద్కర్ వేడుకలు జరుగుతున్న సమయంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. అక్కడికి వచ్చిన అనంతరం.. వేదికపై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో తన చిత్రం లేకపోవడాన్ని ఆమె అవమానంగా భావించారు.
తాను కార్యక్రమానికి వస్తున్నానని తెలిసి కూడా తన చిత్రాన్ని పెట్టలేదని, దళితులకు ఇదేనా గౌరవం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బూబూ జగ్జీవన్ రాం వేడుకల్లోనూ ఆమె ఇదే విధమైన అవమానాన్ని ఎదుర్కొన్నారు.