జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ గాలం..ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు
ఏపీ రాజకీయాలు మరోసారి చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ రాజకీయాలు అని చెప్పడం కన్నా టీడీపీ పాలిటిక్స్ అని చెబితే బాగుంటుంది. అవును తెలుగుదేశంలో కొన్ని ఊహించని పరిణామాలు చోటుచేసుకోబోతున్నట్లు సమాచారం. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న హరికృష్ణ హఠాన్మరణంతో ఇప్పుడు ఆ పోస్టు ఎవరికిస్తే బాగుంటుందా అన్న చర్చ అప్పుడే తెలుగు దేశం పార్టీలో మొదలైంది. దీనికి అన్ని విధాలా సమర్థుడు ప్రజల్లో చరిష్మా కలిగిన వ్యక్తి ఒక్క జూనియర్ ఎన్టీఆరే అని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా చక్కర్లు కొడుతోంది.
తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబం నుంచి ఎవరికైనా ఒక పదవి ఇవ్వాలనే డిమాండ్ తెలుగు తమ్ముళ్లు తెరపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరును వారు టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నందమూరి హరికృష్ణ మృతి చెందిన తర్వాత రెండురోజుల పాటు హరికృష్ణ పార్థీవ దేహం పక్కచే చంద్రబాబు ఉన్నారు. అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు హరికృష్ణ పాడెను కూడా చంద్రబాబు మోశారు.
జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీలో కీలక పదవి..?
జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశంలో కీలక పదవి అప్పగిస్తే బాగుంటుందని తెలుగుతమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. 2008లో నందమూరి హరికృష్ణకు రాజ్యసభకు పంపారు చంద్రబాబు. ఇక తండ్రి కోసం 2009 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. తీవ్రంగా శ్రమించారు. రాత్రనక పగలనక క్యాపెయినింగ్లో కష్టపడ్డారు. టీడీపీని, చంద్రబాబును గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. ప్రచారం ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం బారిన జూనియర్ ఎన్టీఆర్ పడ్డారు. అదృష్టవశాత్తు ఎన్టీఆర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హాస్పిటల్లోని పడకపై నుంచి కూడా ఆయన ప్రచారం చేశారు. అంత కమిట్మెంట్తో నాడు జూనియర్ ఎన్టీఆర్ పనిచేశారు. అప్పటికి రాజకీయాల్లో అనుభవం లేకపోయినప్పటికీ తన ప్రసంగంతో తాతా సీనియర్ ఎన్టీఆర్ను గుర్తుకు తెచ్చారు. ప్రసంగంలో పదునైనా పంచ్లు వాడుతూ అప్పట్లో కొంతమంది ప్రజలను జూనియర్ ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు.
హరికృష్ణ పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారు..?
2009 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చూసింది. చంద్రబాబు అధికారంలోకి రాలేక పోయారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సినిమాలతో బిజీ అయిపోయారు. ఇక ఏనాడు పార్టీ గడప తొక్కలేదు. ఇక ఎక్కడో వేడుకల్లో తప్ప మిగతా సమయాల్లో చంద్రబాబును పెద్దగా కలిసేవారు కాదు. 2014లో సమైక్యాంధ్ర కోసం హరికృష్ణ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్నారు కూడా. ఇక 2014 తర్వాత హరికృష్ణ పొలిట్ బ్యూరో సభ్యుడిగానే ఉన్నారు. మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నప్పటికీ ఆయన్ను పంపేందుకు టీడీపీ అధిష్టానం మొగ్గు చూపలేదు. ఇక్కడే చంద్రబాబుకు హరికృష్ణల మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటారు. ముక్కుసూటిగా మాట్లాడే హరికృష్ణ పలువేదికలపై చంద్రబాబుపై బాహాటంగానే విమర్శలు సంధించారు.
జూనియర్ ఎన్టీఆర్ పవర్ సెంటర్గా మారే అవకాశం..?
ఇక తాజాగా టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్కు పొలిట్ బ్యూరో సభ్యుడిగా తీసుకోవాలన్న ప్రతిపాదన చంద్రబాబు వద్ద ఉంచారు. అయితే చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరోవైపు పార్టీ గెలుపు ఈ సారి కష్టమే అని భావిస్తున్న నేతలు జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుని సరికొత్త వ్యూహంతో ఎన్నికలకు వెళితే విజయం సైకిల్ పార్టీదే అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేస్తే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేదానిపైనా టీడీపీ అధినాయకత్వం సమాలోచనలు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ప్రచారం చేస్తే పవర్ సెంటర్గా మారే అవకాశం కూడా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాలమే సమాధానం చెప్పాలి
సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్కు ఎప్పుడూ తెలుగురాష్ట్రాల్లో ఇమేజ్ ఉంటుందన్న భావన పొలిటికల్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుంది..? టీడీపీ నేతల ప్రతిపాదనను చంద్రబాబు అమలు చేస్తారా..? ఇప్పటికే సినిమాల్లో వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్...ఇంకా చేతిలో పలు భారీ ప్రాజెక్టులున్నాయి. ఇక ఎన్నికల సమయం కూడా దగ్గరపడుతుండటంతో జూనియర్కు ఒకవేళ పొలిట్ బ్యూరోలో సభ్యత్వం ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారా అనే దానిపై కాలమే సమాధానం చెప్పాలి.