వ్యవసాయ బిల్లులకు మద్దతిస్తూ సాయిరెడ్డి ప్రసంగం- పాత వీడియోతో ఆడుకుంటున్న టీడీపీ
కేంద్రం ఈ ఏడాది పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ బేషరతుగా మద్దతిచ్చింది. అప్పట్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు మద్దతుగా మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో బిల్లులకు మద్దతిచ్చిన వైసీపీ రైతుల ఆగ్రహం నేపథ్యంలో ఇవాళ్టి భారత్ బంద్కు మద్దతు ప్రకటించింది. దీంతో విపక్ష టీడీపీ అప్పట్లో సాయిరెడ్డి పార్లమెంటులో మాట్లాడిన వీడియోను బయటపెట్టింది. ఇప్పుడు వైసీపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
వ్యవసాయ చట్టాల విషయంలో భారత్ బంద్కు మద్దతిస్తున్న వైసీపీని టార్గెట్ చేస్తూ ఇవాళ టీడీపీ నేతలు వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. ఇదే అంశంపై ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. "మతిమరుపు రోగం వచ్చిందా ఏంటి వీసా రెడ్డి ? వ్యవసాయ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చింది మర్చిపోయావా ? ఈ బిల్లుని సమర్ధించని వాళ్ళు అందరూ దళారీలు అంటూ వ్యాఖ్యలు చేసి, రాజ్యసభలో అందరి చేత బూతులు తిట్టించుకుంది మర్చిపోయావా ?
ఎక్కడైనా నీ ప్రసంగంలో "స్వామినాథన్ కమిటీ " పేరు ఎత్తావా ? తెలుగుదేశం పార్టీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది, కార్పొరేట్ ల ఆధిపత్యం గురించి, మద్దతు ధర గురించి, మార్కెట్ల పటిష్టత గురించి, కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల రైతులు ఎలా నష్టపోయేది, ఇలా అనేక అంశాల పై తెలుగుదేశం పార్టీ కీలక సూచనలు ఇచ్చిన సంగతి మర్చిపోయావా ? బేషరతుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు నాటకాలు ఆడతారా ? ఇందుకు కాదు మిమ్మల్ని ఫేక్ ఫెల్లోస్ అనేది." అంటూ అయ్యన్నపాత్రుడు ఓ రేంజ్లో చెలరేగిపోయారు.
ఇదే కోవలో వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో వైసీపీ మద్దతు పలికిన వీడియోలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విడుదల చేశారు.ఈ వీడియోలు కోట్ చేస్తూ "విజయసాయి రెడ్డిది నోరు కాదు అబద్ధాల పుట్ట.రాజ్యసభ లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను సమర్దించి,మద్దతు తెలపని వాళ్ళు దళారీలు అన్న మీరు ఇప్పుడు మడమ తిప్పి,మాట మార్చారు.కేసుల కోసం తల దించుకునే సంస్కృతి జగన్ రెడ్డిది.రైతుల సమస్యలు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ధైర్యం టిడిపిది" అంటూ బుద్ధా వైసీపీని టార్గెట్ చేశారు.