అసలెందుకీ గవర్నర్ వ్యవస్థ!...టిడిపి ఆక్రోశం:ఆ మీటింగ్ తరువాతే
అమరావతి:సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే గవర్నర్ పై దుమ్మెత్తిపోయడంతో ఇక టిడిపి నేతల ప్రజెంట్ టార్గెట్ గా గవర్నర్ నరసింహన్ మారారు. గవర్నర్ పదవి గురించి అన్ని కోణాల్లో లోపాలు వెతికి మరీ టిడిపి నేతలు తమ ఆక్రోశం వెళ్లగక్కుతున్నట్లు కనిపిస్తోంది.
Recommended Video
గవర్నర్ నరసింహన్ పై ఈ దాడి రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నాలుగో రోజుల క్రిందట సిఎం చంద్రబాబుతో గవర్నర్ నరసింహన్ సమావేశం తరువాత ఈ దాడి తీవ్ర రూపం దాల్చినట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి చంద్రబాబుతో సమావేశంలో చంద్రబాబుకు గవర్నర్ నరసింహన్ ఏదో నచ్చని విషయాన్ని గట్టిగానే చెప్పినట్లున్నారనే విశ్లేషణలు జోరందుకున్నాయి. దీనికి తోడు ఆ సమావేశం తరువాత స్వల్ప కాల వ్యవధిలోనే గవర్నర్ నరసింహన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లడం, మరోవైపు టిడిపి ఆయనపై దాడిని ముమ్మరం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ముందు చంద్రబాబు...దండెత్తారు
గవర్నర్ నరసింహన్ పై చంద్రబాబు అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపికి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గవర్నర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. అంతేకాదు...అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పిందని...ఆ అంశంపై పోరాటం కూడా చేశామని చెప్పారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం పని చేసుకోవాలని, వార్తాపత్రికల్లో న్యూస్ వచ్చేలా గవర్నర్ వ్యవహరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. గవర్నర్ తో సమావేశం అయిన 24 గంటల్లోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తరువాత...టిడిపి నేతలు...ఒక్కొక్కరుగా
ఇక సహజంగానే గవర్నర్ నరసింహన్ తీరుపై సిఎం చంద్రబాబు దండెత్తాక ఇక ఆ పార్టీ నేతలు ఆయనపై విమర్శలతో ధ్వజమెత్తుతున్నారు. మంత్రుల నుంచి ఓ మోస్తరు స్థాయి వరకు టీడీపీ నేతలందరి మెయిన్ టార్గెట్ ఇప్పుడు గవర్నర్ నరసింహనే అనే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా టిడిపి మంత్రి జవహర్ మాట్లాడుతూ అసలు ఏపీలో గవర్నర్ల వ్యవస్థ కామెడీగా నవ్వుకొనేందుకు తప్ప మరెందుకూ పనికి రాకుండా పోయిందని విమర్శించారు. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే గవర్నర్ను చూశానని, ఆ తరువాత ఆయనను చూడాల్సిన అవసరం రాలేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. రాజ్భవన్లో తేనేటి విందుకు కనీసం రూ.20 వేలు ఖర్చుపెట్టి హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అని మంత్రి జవహర్ వ్యాఖ్యానించడం విశేషం. గవర్నర్ గుడులు తిరిగేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి చొరవ చూపించడంలేదని జవహర్ ఆరోపించారు.
మరికొందరు...టిడిపి నేతలు...
మరో మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం గవర్నర్ నరసింహన్ పై ఆచితూచి స్పందించారు. గవర్నర్ నరసింహన్...ప్రజల మనోభావాలను, వాస్తవ పరిస్థితులను కేంద్రప్రభుత్వానికి తెలియజేయడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్న గవర్నర్ నరసింహన్ కేంద్రంతో వైరం వద్దని చెప్పారని...కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో భయపడేది లేదని, వెనక్కి తగ్గేదిలేదని ముఖ్యమంత్రే బదులిచ్చారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ నరసింహన్ ను ఉద్దేశించి టిడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు మాట్లాడుతూ విభజన చట్టం హామీలు అమలు చేయాలని తాము ధర్మపోరాటం చేస్తుంటే, దూకుడు తగ్గించుకోండంటూ గవర్నర్ నరసింహన్ తమ ప్రభుత్వాన్ని హెచ్చరించడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ తో గవర్నర్ నరసింహన్ ఫోన్ తో సంప్రదింపులు జరిపారనేది మరికొందరు టిడిపి నేతల ఆరోపణ.
టిడిపి...అందరితో యుద్దం
కారణాలు ఏమైనప్పటికీ టిడిపికి ఇటీవలికాలంలో ప్రత్యర్థుల సంఖ్య భాగా పెరిగింది. సాధారణంగా ప్రతిపక్షాలతో వైరం ఎప్పుడూ ఉండేదే కాబట్టి ఈ రెండు పక్షాల మధ్య విమర్శల గురించి ప్రజలు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అయితే ఆ తరువాత కాలంలో టిడిపి ఆ పార్టీ మిత్ర పక్షం బిజెపి ఆగర్భ శత్రువుల్లా మారిపోవడం, ఆ తరువాత మొన్నటిదాకా మనతోనే ఉన్నాడని టిడిపియే చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీకి పక్కలో బల్లెంలా మారడం, ఇక తాజాగా గవర్నర్ నరసింహన్ కూడా తమని దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని టిడిపి దండెత్తడాన్ని బట్టి టిడిపి ముందు ముందు సర్వశక్తులూ ఒడ్డి పోరాటం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక రాజకీయంగా మరింత వేడెక్కే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.