కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి రామ సుబ్బారెడ్డితో సహా మరో కీలక నేత: జగన్ గ్రీన్ సిగ్నల్
కడప: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి భారీ షాక్. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో టీడీపీకి ఇద్దరు ఇద్దరు కీలక నేతలు వారి అనుచరులతో సహా వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న రామసుబ్బారెడ్డి కొంత కాలంగా గత ఎన్నికల ముందే వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, చంద్రబాబు బుజ్జగింపులతో అప్పట్లో రామసుబ్బారెడ్డి నిర్ణయాన్ని విరమించుకున్నారు.
అయితే, ఇప్పుడు జిల్లాలో ప్రత్యేకంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల కారణంగా ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా జిల్లాలో బలిజ వర్గానికి చెంది..టీడీపీలో కీలక నేతగా ఉన్న మరొకరు సైతం వైసీపీలో చేరటం ఖాయమైంది. ముఖ్యమంత్రి జగన్ సైతం వీరిద్దరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లోనే వీరిద్దరూ ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలోకి రామసుబ్బారెడ్డి..
కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ నేత..మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరటం ఖాయమైంది. చిరకాలంగా తనకు ప్రత్యర్ధిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన సమయం నుండి రామసుబ్బా రెడ్డి పార్టీ వీడే ఆలోచన చేశారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించటం.. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా..రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ వీడకుంగా జాగ్రత్త పడ్డారు. అయితే, 2019 ఎన్నికల సమయంలో జమ్మల మడుగు ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి..కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేయాలని ఒప్పందం కుదింరింది. అందులో భాగంగా..రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా..దానిని ఆదినారాయణ రెడ్డి సోదరుడు శివనాధరెడ్డికి కేటాయించారు.
ఆదినారాయణ రెడ్డిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో...
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావటం..రాజధాని బిల్లుల సమయంలో ఆదినారాయణ రెడ్డి సోదరుడు శివనాధ రెడ్డి సైతం టీడీపీని వీడటంతో..వైసీపీకి దగ్గరయ్యారు. అయితే, ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరినా..గుర్తింపు మాత్రం రాలేదు. ఇప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నారు. ఇక, రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరితే..ప్రాధాన్యత ఉంటుందని వైసీపీ ముఖ్యనేతల నుండి హామీ దక్కింది. దీంతో..నాలుగు రోజులుగా రామసుబ్బారెడ్డి తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి..వైసీపీలోకి వెళ్లాని నిర్ణయించినట్లు సమాచారం. రెండు సార్లు ఎమ్మెల్యేగా..మంత్రిగా పని చేసిన రామసుబ్బారెడ్డిని వైసీపీలోకి తీసుకోవటం ద్వారా ఆదినారాయణ రెడ్డిని పూర్తిగా దెబ్బతీయాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
టీడీపీకి పాలకొండ్రాయుడు గుడ్ బై...
ఇక, కడప జిల్లాలో టీడీపీలో ముఖ్య నేతగా ఉన్న బలిజ వర్గానికి చెందిన పాలకొండ్రాయుడు సైతం వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఆయన నాలుగు సార్లు రాయచోటి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుండి గెలిచి..1988లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. ఇక, 1999, 2004లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1984లో రాజంపేట లోక్ సభ స్థానం నుండి టీడీపీ ఎంపీగానూ గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో ఆయన కుమారుడు ప్రసాద బాబుకు టీటీడీ బోర్డు సభ్యుడుగా అవకాశం ఇచ్చారు. కొద్ది రోజులగా ఎంపీ మిధున్ రెడ్డి..ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి టీడీపీ నేత పాలకొండ్రాయుడుతో పాటుగా ఆయన తనయుడిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు మంతనాలు సాగించారు. వైసీపీ ముఖ్య నేతతోనూ మాట్లాడించారు. దీంతో..వారిద్దరూ తమ అనుచరులతో కలిసి వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
Recommended Video
ఈ వారంలోనే..
ఈ వారంలోనే వారిద్దరూ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపలో క్లీన్ స్వీప్ చేసేందుకు వీలుగా..ఎక్కడా టీడీపీకి అవకాశం లేకుండా టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ ఇద్దరు కీలక నేతలు వైసీపీలో చేరటం ద్వారా కడప జిల్లాలో టీడీపీకి నష్టం కలిగిస్తుంది. కడప జిల్లాలో టీడీపీకి ప్రధాన నేతగా ఉన్న మరో ముఖ్యుడుతోనూ వైసీపీ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.