"మరచిపోలేని రోజు...పూర్వజన్మ సుకృతం":పోలవరం గ్యాలరీ వాక్ ప్రారంభోత్సవం...టిడిపి నేతల హృదయ స్పందనలు
పశ్చిమ గోదావరి:పోలవరం ప్రాజెక్ట్ గ్యాలరీ వాక్ను బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అతి ముఖ్యమైన ఈ ఘట్టం అనంతరం సిఎం చంద్రబాబుతో సహా టిడిపి నేతలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇది జీవితంలో మరువలేని క్షణం" అని చంద్రబాబు చెప్పారు.
సిఎం చంద్రబాబుతో పాటు ఈ పోలవరం గ్యాలరీ వాక్ లో పాల్గొన్న స్పీకర్ కోడెల, మంత్రి లోకేష్ తదనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం గ్యాలరీ వాక్ అందరి జీవితాల్లో మరచిపోలేని రోజు అని స్పీకర్ కోడెల చెప్పగా, పోలవరం గ్యాలరీ వాక్లో పాల్గొనడం తన పూర్వజన్మసుకృతమని మంత్రి నారా లోకేష్ అన్నారు. తనతో పాటు దేవాన్ష్ కూడా గ్యాలరీలో నడిచాడని..దేవాన్ష్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని లోకేష్ చెప్పారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పురోగతిలో మరో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. పోలవరం గ్యాలరీ వాక్ నిర్మాణం పూర్తవడంతో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. అనంతరం కుటుంబసభ్యులు,టిడిపి నేతలతో కలిసి 48వ బ్లాక్లో సీఎం పోలవరం గ్యాలరీలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి 36వ బ్లాక్ వరకు నడక సాగించారు. ఈ సందర్భంగా గ్యాలరీ లోపల ఆక్సిజన్ సిలిండర్లను, స్టాండింగ్ ఏసీలను అమర్చారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులొచ్చినా పోలవరాన్ని పూర్తి చేసి తీరతామని స్పష్టం చేశారు. గ్యాలరీ మొత్తం నడిచానని...చక్కటి అనుభూతిని ఇచ్చిందన్నారు. తానే శంకుస్థాపన చేయడం...తానే గ్యాలరీ వాక్ నడవడం...ఇది అత్యంత అరుదైన సంఘటనగా సీఎం అభివర్ణించారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రాజెక్టు నిర్మాణం ఆగదన్నారు. ప్రతిపక్షాలు సూచనలు చేస్తే లోపాలుంటే సరిదిద్దుకుంటామని...రాజకీయ విమర్శలు చేస్తే పట్టించుకోమని అన్నారు. బీజేపీ, వైసీపీ విమర్శలు సహజమని తెలిపారు. ప్రాజెక్టును వచ్చే ఏడాది మే లోపు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్తామని సీఎం వెల్లడించారు.
అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ పోలవరం గ్యాలరీ వాక్ అందరి జీవితాల్లో మరచిపోలేని రోజు అన్నారు. ఆధునిక పరిజ్ఞానం, వేగంగా నిర్మితమవుతున్న ప్రాజెక్ట్ పోలవరం అని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలున్నా పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగుతోందని స్పీకర్ కోడెల చెప్పుకొచ్చారు.
పోలవరం గ్యాలరీ వాక్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి నారా లోకేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని లోకేష్ కొనియాడారు. నాగార్జునసాగర్కు నెహ్రూ శంకుస్థాపన చేస్తే...ఇందిరాగాంధీ గ్యాలరీ వాక్ చేశారని గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్ట్కు చంద్రబాబే శంకుస్థాపన చేసి..చంద్రబాబు గ్యాలరీ వాక్ చేయడం విశేషమన్నారు. పోలవరం ప్రాజెక్టుని 72 సార్లు వర్చువల్ రివ్యూ చేశారన్నారు.
కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ- వైసీపీ నేతల విమర్శల్ని ఎవరూ పట్టించుకోవద్దన్నారు. డెల్టా రైతులనడిగితే పోలవరం, పట్టిసీమ విలువ చెబుతారని మంత్రి లోకేష్ తెలిపారు. పోలవరం గ్యాలరీ వాక్ లో అమ్మ, నాన్న, బ్రహ్మణి, దేవాన్ష్ ,తాను కలిసి నడిచామని...దేవాన్ష్ని ఎక్కడా ఎత్తుకోలేదని అన్నారు. పోలవరంపై ప్రతిపక్షాల విమర్శల్లో పస లేదని ప్రాజెక్టు చూస్తే తెలిసిపోతుందని మంత్రి తెలిపారు. వాళ్లు విమర్శలు చేసేది కేవలం రాజకీయం కోసమే అని మండిపడ్డారు. డెల్టా రైతులనడిగితే పోలవరం, పట్టిసీమ విలువ చెబుతారని మంత్రి లోకేష్ తెలిపారు.