'కేసీఆర్ దారిలో... కేసుల పేరుతో టీడీపీ డేటా చోరీ, జగన్ బహిరంగంగా అంగీకరించారు'
అమరావతి: ఏపీలో 54 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు బుధవారం ఆరోపించారు. దొంగ ఓట్లు తొలగిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కానీ పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపుకు కుట్ర జరుగుతోందన్నారు. ఏపీలో టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, వైసీపీకి మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అనుసంధానకర్తగా ఉన్నారని ఆరోపించారు. వీరంతా కలిసి ఏపీలో ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు.
డేటా తొలగింపు: 'ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, కీలక సూత్రధారులు బొత్స, పీకే'
ఈసీని తప్పుదోవ పట్టించిన జగన్ శిక్షార్హుడు
ఎన్నికల సంఘాన్ని వైసీపీ అధినేత జగన్ తప్పుదోవ పట్టించాడని, అందుకు అతను శిక్షార్హుడు అని కనకమేడల అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఇలా ఒట్ల తొలగింపు ద్వారానే విజయం సాధించిందని చెప్పారు. జగన్ అధికారంలోకి రారని తెలిసి ఓట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారని విమర్శలు గుప్పించారు. ఎన్ని నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించారో ఎన్నికల సంఘం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు వైసీపీ-తెరాస ప్రయత్నించిందన్నారు. పార్టీ డేటా, సేవామిత్రల డేటాను దొంగిలించడం నేరమన్నారు. ఈ కుట్రలో భాగస్వాములపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓట్ల తొలగింపుతో కేసీఆర్ గెలిచారని, ఏపీలో జగన్ కూడా అలాగే గెలవాలని భావిస్తున్నాడని చెప్పారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలే సలహాదారులు అన్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నేతలు సమర్థిస్తుండగా, ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈసీని అపహాస్యం చేసేలా, ఈసీ పని తీరునే జగన్ తప్పుబడుతున్నారన్నారు. కేసుల పేరుతో డేటా మొత్తం చోరీ చేశారన్నారు. పార్టీ డేటాను నిక్షిప్తం చేసేందుకు తెరాసకు కూడా ఓ సంస్థ ఉందని, అలాగే తమకూ ఉందని చెప్పారు. వర్సిటైల్ మొబిటెక్ సంస్థ తెరాసకు పని చేస్తోందన్నారు. ఓ రాష్ట్రం వ్యవహారంలో మరో రాష్ట్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే యత్నం
ఏపీ డేటా లీకేజీకి తెలంగాణలో కుట్ర జరిగిందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఎనిమిది లక్షల ఓట్ల తొలగింపునకు వైసీపీ నేతలు ఫారం 7 ఇచ్చారని, అన్ని జిల్లాల్లో వైసీపీ బూత్ కమిటీ నేతల పేర్లతో దరఖాస్తులు చేశారని చెప్పారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కోసం కేసీఆర్తో కలిసి జగన్ కుట్ర పన్నారన్నారు. ఏపీ డేటాను తెలంగాణ పోలీసులే దొంగిలించి జగన్కు ఇస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉండదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసుల ద్వారా డేటా చోరీ చేయిస్తోందని, లోటస్ పాండ్లో జగన్, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు. కేసీఆర్, జగన్ కుట్రలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ బూత్ కమిటీ మెంబర్ల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారన్నారు.
జగన్ బహిరంగంగా ఒప్పుకున్నారు
జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తున్నారని మరో మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ఫారం 7ను ఆయన దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ బలంగా ఉన్నచోట్ల, గెలిచే చోట్ల ఓట్లు తొలగిస్తున్నారని, ఈ విషయాన్ని జగన్ బహిరంగంగానే ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్, కేసీఆర్, మోడీ కలిసి ఏపీని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారన్నారు. బ్లూ ఫ్రాగ్ అనే సంస్థ గతంలో వైయస్ రాజశేఖర రెడ్డికి సహకరించిందని చెప్పారు. ఫారం 7 దాఖలుతో జగన్ నేరమనస్తత్వం తేలిపోయిందని మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తొలగించే ప్రయత్నం చేసిన జగన్, అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు ఉండనిస్తారా అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము 150 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో గెలుస్తామన్నారు.