జగన్ పార్టీలోకి దగ్గుబాటి... చంద్రబాబు నిప్పులు: 'బీజేపీ-వైసీపీ జాయింట్ వెంచర్ తేలిపోయింది'
అమరావతి: దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వేర్వేరుగా స్పందించారు. దగ్గుబాటి, చంద్రబాబు మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హితేష్ వైసీపీలో చేరడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు..
పురంధేశ్వరికి బీజేపీ పెద్దలు చెప్పారు: వైసీపీలోకి దగ్గుబాటి-కొడుకు హితేష్, జగన్ హామీలు
దగ్గుబాటి, లక్ష్మీపార్వతి.. వైసీపీలో అవకాశవాదులు
అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. దగ్గుబాటి చేరని పార్టీలు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ... అన్ని పార్టీలు మారారని ఎద్దేవా చేశారు. అధికారం కోసమే ఫిరాయింపులు అన్నారు. అధికారం కోసమే ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కు అయ్యారన్నారు. టీడీపీ నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్సులో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో పురంధేశ్వరి కేంద్రమంత్రి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారని, ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారన్నారు. అధికారం కోసమే ఫిరాయిస్తున్నారని విమర్శించారు. వీరు అవకాశవాదంతో ఎన్టీఆర్ను వాడుకున్నారని, ఎన్టీఆర్కు అప్రతిష్ట తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం వైసీపీలో అవకాశవాదులు ఉన్నారన్నారు. అవకాశవాదులు ఒకేచోట చేరిపోయారన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని, వైయస్ బయోపిక్తో పాటు మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
భార్య ఓ పార్టీ, భర్త మరో పార్టీ.. కేవలం దగ్గుబాటి కుటుంబంలోనే
బావ ఒక పార్టీ, బావ మరిది మరో పార్టీలు ఉండటం ఇప్పటి వరకు చాలా చూశామని, కానీ ఇప్పుడు దగ్గుబాటి కుటుంబంలోని వారు వేర్వేరు పార్టీలో ఉండటం విడ్డూరమని బుద్ధా వెంకన్న విమర్శించారు. దగ్గుబాటి కుటుంబంలో మాత్రం భార్య పురంధేశ్వరి ఓ పార్టీ, భర్త ఒక పార్టీలో ఉన్నారని, ఇలాంటి విచిత్రం ఒక్క దగ్గుబాటి కుటుంబంలోనే ఉందన్నారు. పురందేశ్వరి బీజేపీలోనే ఉంటానని చెబుతున్నారని, ఆమె భర్త వెంకటేశ్వర రావు, కొడుకు హితేష్ మాత్రం వైసీపీలోకి వెళ్తామని చెబుతున్నారన్నారు.
దగ్గుబాటికి టీడీపీ సూటి ప్రశ్న
ఇది బీజేపీ, వైసీపీ జాయింట్ వెంచర్ అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని బుద్ధా వెంకన్న అన్నారు. పురందేశ్వరి కుటుంబం జగన్ పంచన చేరుతుందని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. అది ఇప్పుడు రుజువైందన్నారు. ఇక్కడ ఓ విషయం ఉందని, పురందేశ్వరి వెళ్లకుండా భర్తను, కుమారుడిని పంపించారన్నారు. జగన్నురెండేళ్ల నుంచి గమనిస్తున్నాన్నాని, ఆయన చాలా మంచోడని దగ్గుబాటి చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జగన్లో చూసిన ఆ నాయకత్వ లక్షణాలు ఏమిటో చెప్పాలన్నారు. దగ్గుబాటి ఊసరవెళ్లిని మించిపోయారన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ మారడం దగ్గుబాటికి అలవాటు అన్నారు.
టీడీపీదే విజయం.. అశోక్ గజపతి రాజు
ఏపీ ప్రభుత్వంపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసిన విమర్శలపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. గతంలో దగ్గుబాటితో తాను పని చేశానని అన్నారు. ప్రతి పనిలోను మంచి చెడు ఉంటాయన్నారు. జగన్ను దగ్గుబాటి కలవడం, ఆ వెంటనే చంద్రబాబుపై విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎవరు ఎవర్ని కలిసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమన్నారు.