చంద్రబాబు..నమ్మారు-మునిగారు: పవన్..లగడపాటితో సహా వారంతా : టీడీపీ నేతల నోట నిజాలు..!
ఏపీలో ఘోర పరాజయం తరువాత టీడీపీ సీనియర్లు కొన్ని ఆసక్తి కర విషయాలు బయట పెడుతున్నారు. పార్టీ ఓడితే బాధలేదు..కానీ, ఈ రకంగా ఓడటం జిర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. అయిదేళ్లు చంద్రబాబు కష్టపడినా..చేసిన కొన్ని తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటున్నారు. ఆయన మేధావి అయినా..కొన్ని విషయాల్లో వారు చెప్పినవి గుడ్డిగా నమ్మి..మోసపోయారని ఫలితంగా ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషిస్తున్నారు.
కుటుంబరావు మితిమీరిన జోక్యం..
2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి కుటుంబరావు ప్రతీ అంశంలో మితి మీరి జోక్యం చాలా అంశాల్లో చంద్రబాబును ప్రభావితం చేసిందని నేతలు చెబుతున్నారు. రైతు రుణ మాఫీలో కోతలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానం, రాజధానిలో స్విస్ ఛాలెంజ్ ఒప్పందం, అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆయనే ప్రభుత్వానికి సూచనలు చేసారు. సీనియర్గా ఉన్న ఆర్దిక మంత్రి యనమల కంటే కూడా కుటుంబరావు సలహాలు చంద్రబాబును ప్రభావితం చేసాయని..అవే వ్యతిరేకతకు కారణమయ్యాయని వివరిస్తున్నారు. ఇక, కోటరీలో నేతలు గతంలో వైయస్ తరహాలో పార్టీ నేతలకు స్వేచ్చ ఇవ్వాలంటూ చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చారు. అయితే, వైయస్ తరహలో ఎమ్మెల్యేల పైన చంద్రబాబు పట్టు కోల్పోవటంతో క్షేత్ర స్థాయిలో ఊహించని వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రభుత్వంలో అవినీతి వ్యవహారం..దీని పైన స్వయంగా ప్రధాని మాట్లాడటంతో ఊహించని నష్టం జరిగింది.
ఇంటలిజెన్స్...ఆర్టీజీఎస్..లగడపాటి..పవన్
ఇక, ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ముఖ్యమంత్రికి వాస్తవ పరిస్థితులు వివరించే ఇంటలిజెన్స్ ఉన్నతాధికారులు వాస్తవాలు దాచి..ముఖ్యమంత్రి వద్ద మార్కులు కోసం ఆయన వద్ద ఆయన గొప్పలు చెప్పి తిప్పలు తెచ్చారంటున్నారు. చంద్రబాబు బాగా నమ్మిన వ్యవస్థ రియల్ టైం గవర్నెన్స్. వారు పోన్ కాల్స్ ద్వారా సర్వేలు చేసి.. కేవలం అంకెలతో చంద్రబాబుకు అంతా సానుకూలంగా ఉందని ఇచ్చిన నివేదికలు కొంప ముంచాయి. లోకేశ్ మంత్రిగా తన శాఖకు పరిమితం కాకుండా..మితిమీరిన జోక్యం నిర్ణయాల పైన ప్రభావం చూపింది. ఇక, కొందరు పత్రికాధిపతులు చంద్రబాబు వద్ద మెప్పు కోసం ఆయన్ను ఆకాశానికెత్తటం మినహా..వాస్తవాలు దాచి పెట్టారు.
లగడపాటి..పవన్
ఇదే సమయంలో ఎన్నికల వేళ పవన్ కళ్యాన్తో పొత్తు..ప్రచార శైలి విషయంలో లగడపాటి ఇచ్చిన సలహాలు చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ తీసింది. పవన్ కళ్యాన్తో పొత్తు పెట్టకుందామని చంద్రబాబు ప్రతిపాదిస్తే..ఒక పత్రికాధిపతితో సహా చంద్రబాబు వద్దకు వెళ్లిన లగడపాటి దీని కారణంగా వ్యతిరేక ఓటు జగన్కు వెళ్తుందని.. విడి విడిగా పోటీ చేయాలని సూచించారు. అయితే, పవన్ సహకారం అందిస్తారనుకుంటే ఆయన మేలు చేయకపోగా నష్టం చేసారు. ఇదే సమయంలో..ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తరహాలో సెంటిమెంట్ పెంచి ఓట్లు వేయించుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్... మోదీ పైనే ఎక్కువగా టార్గెట్ చేసారు. అదే ఊహించని దెబ్బ కొట్టింది. టిఆర్యస్తో పొత్తుకు ప్రయత్నించి..ప్రచారంలో మాత్రం విమర్శలు చేయటం చంద్రబాబు స్థాయిని తగ్గించింది. ఇలా..తమ ఓటమికి కారణాలను టిడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.