పవన్-జగన్లతో కలిసి దిగితే చెప్పండి: సబ్బం, వారసత్వంపై జనసేనానికి దిమ్మతిరిగే కౌంటర్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏమీ చేయలేక బీజేపీ కొందరు నేతలను కీలుబొమ్మలుగా ఉపయోగించుకుంటోందని మాజీ ఎంపీ సబ్బం హరి ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో మండిపడ్డారు. రాజకీయ క్రీడ కోసం బీజేపీ రాష్ట్ర ప్రజలను బలి చేస్తోందని ఆరోపించారు.
పవన్, జగన్లతో కలిసి బరిలోకి దిగుతామని చెప్పండి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ, చంద్రబాబు వద్దన్నారని, ప్యాకేజీ కావాలని చెప్పారని ఎందుకు చెప్పడం అని సబ్బం అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కావాల్సింది వాదప్రతివాదనలు కాదని, నిజాలు అన్నారు. ఏపీలో బీజేపీ గెలవాలనుకున్నప్పుడు చంద్రబాబును ఓడిస్తామని బహిరంగంగా చెప్పాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జగన్లతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పాలని సవాల్ చేశారు.
కేసీఆర్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పైన కూడా సబ్బం హరి స్పందించారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ను గెలిపించేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో అర్థమవుతోందని అన్నారు. అధికారం కోసం ఏమైనా చేసుకోండి.. కానీ ఏపీకి మాత్రం న్యాయం చేయాలని బీజేపీని కోరారు.
ఇదో ఫ్యాషన్ అయింది
టీడీపీ, చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేయడం ఇటీవల ఓ ఫ్యాషన్గా మారిందని టీడీపీ ఎంపీ రవీంద్ర కుమార్ అన్నారు. కూటమిలో ఉన్నప్పుడు ఒక్క విమర్శ చేయని బీజేపీ నేతలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక వేల కోట్ల అవినీతి ప్రచారం చేస్తున్నారన్నారు. అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉంటే చూపాలన్నారు. వైసీపీ నుంచి డిప్యూటేషన్పై వచ్చిన నేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారన్నారు. ఓ వైపు జగన్, మరోవైపు పవన్లతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బీజేపీపై మండిపడ్డారు.
వారసత్వంపై పవన్కు టీడీపీ రివర్స్
విభజన హామీలు ప్రశ్నించలేని పవన్కు రాజకీయ వారసత్వం గురించి మాట్లాడే హక్కులేదని మంత్రి జవహర్ అన్నారు. సినీ ఊహల్లో నుంచి బయటకు వచ్చి కవాతు చేయాల్సింది అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలోకి వారసత్వంగా రాలేదా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఒక్క సీటు కూడా గెలవరని జలీల్ ఖాన్ అన్నారు. కవాతులో పవన్ పిచ్చిప్రేలాపనలు చేశారన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. రాజకీయ కుటుంబంలో పుట్టిన వారు వారసులు ఎందుకు కావొద్దని, పవన్, అతని కుటుంబ సభ్యులు హీరోలు ఎలా అయ్యారో గుర్తుంచుకోవాలన్నారు. 2009లో పీఆర్పీకి 18 సీట్లు వచ్చాయని, పవన్కు ఒక్కటీ రాదన్నారు.