'పాదయాత్ర ముగియకుండానే జగన్ను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయబోయేది పాదయాత్ర కాదని, పాదాలు అరిగే యాత్ర అని టిడిపి నేత ముళ్లపూడి రేణుక బుధవారం ఎద్దేవా చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేయబోయేది పాదయాత్ర కాదని, పాదాలు అరిగే యాత్ర అని టిడిపి నేత ముళ్లపూడి రేణుక బుధవారం ఎద్దేవా చేశారు.
జనసేన ఆఫీస్ ప్రారంభం, ఖురాన్ పఠించిన అలీ: అతిథిగా సామాన్యుడు, ఏం కావాలని పవన్ అడిగితే (ఫోటోలు)
జగన్ పాదయాత్రను నమ్మరు
జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఏపీ ప్రజలు ఆయనను ఏమాత్రం నమ్మరని రేణుక చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు.
పాదయాత్ర ముగియకుండానే జగన్ అరెస్ట్ కావొచ్చు
జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని టిడిపి ప్రయత్నించడం లేదని, తమ పార్టీకి మేలుచేసే ఆ కార్యక్రమం జరగాలనే కోరుకుంటున్నామని మంత్రులు ఆదినారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు అన్నారు. పాదయాత్ర ముగియకుండానే ఈడీ ఎక్కడ ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు.
వారి వల్ల ఒరిగేది లేదు, సభకు రాకున్నా ఓకే
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసిపి నిర్ణయించుకుందని వస్తున్న వార్తలపై ఆది స్పందించారు. శాసనసభలో వారివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బహిష్కరణ అస్త్రం ద్వారా తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామాలకు భయపడటం లేదని, తమ రాజీనామాలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.
జగన్ పాదయాత్ర టిడిపికే లబ్ధి
జగన్ పాదయాత్ర ద్వారా టిడిపికి లబ్ధి అని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు విశ్వసిస్తారన్నారు. రాష్ట్రంలో శాశ్వత అధికారంలో ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆశయమని, దానికి అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో 2019లో జరగనున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ స్థానాల్లో విజయం సాధించేందుకు మిషన్ 2019తో ముందుకు సాగుతున్నామన్నారు.
జగన్కు అనురాధ హెచ్చరిక
ప్రతిపక్ష నేతగా జగన్ ఉండడం రాష్ట్ర దౌర్భాగ్యమని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికైన అసెంబ్లీని బహిష్కరించి, పాదయాత్ర చేపడతాననడం విడ్డూరమన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల్లో అలజడి సృష్టించాలనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.
పాదయాత్రకు ముందు, తర్వాత శ్రీవారి దర్శనం
నవంబర్ 2 తేదీ ప్రారంభం కావాల్సిన జగన్ పాదయాత్ర 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జగన్ నవంబర్ 3న తిరుమలకు వెళ్లనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర నిర్వహించాక విపక్ష నేత మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. చివరగా కాలినడకన ఏడు కొండలు ఎక్కి తిరుమలేశుని దర్శించుకోవడంతో పాదయాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
120 నియోజకవర్గాల్లో పాదయాత్ర
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ చేపట్టే ఈ పాదయాత్రను మూడు వేల కి.మీ.లకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కోర్టు విచారణ నిమిత్తం ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉన్నందున నెలలో 4 రోజులు అంటే ఆరు నెలల్లో 24 రోజులు దీనికే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రాథమికంగా 120 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.