పోలవరం లక్ష్యాన్ని తాకట్టు పెడితే వైసీపిని చరిత్ర క్షమించదన్న టీడిపి నేతలు.!
అమరావతి/హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టుపై ఏపి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడం, ఆ లేఖను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తప్పుబట్టడంతో రాజకీయ దుమారం తారా స్థాయికి చేరుకుంది. అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య పోలవరానికి సంబందించిన విమర్శల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా టీడిపీ నేతలు యనమల రామకృష్టుడు, దేవినేని ఉమామహేశ్వర రావు పోలవరం గురించి వైసీపి ప్రభుత్వంపై చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.
Recommended Video
జగన్ సర్కార్ కు కేంద్రం మరో షాక్ .. పోలవరం ప్రాజెక్ట్ నిధులకు మరింత కోత ?
పోలవరం గురించి మాటల యుద్దం.. దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు..
లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచేశారని వైసీపి ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో అన్నీ రివర్స్ రికార్డులే అని యనమల ఎద్దేవా చేశారు. పోలవరాన్ని ముంచేసిన పాపం జగన్ మోహన్ రెడ్డిదే అని, పోలవరం డీపీఆర్ను రివర్స్ చేసిన ఘనత కూడా జగన్ మోహన్ రెడ్డిదే అని ఘాటు వ్యాఖ్యలు చేసారు యనమల. డిపిఆర్ ను 20వేల కోట్ల రూపాయలకు రివర్స్ చేసి, 35వేల కోట్ల రూపాయలకు పోలవరాన్ని ముంచేశారని ఆరోపించారు. తన కేసుల మాఫీ కోసం పోలవరాన్ని ఫణంగా పెట్టారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం అంశంలో వైసిపి ఆత్మవిమర్శలు చేసుకోవాలి.. అసత్య ప్రచారాన్ని ఆపాలన్న యనమల..
అంతే కాకుండా అటు భరించ లేని అప్పులు, చెల్లించలేని పన్నుల భారంతో పేదలను ఉక్కిరిబిక్కిరి చేశారని వైసిపి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పాలన చేతగాక జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారన్నారు యనమల రామకృష్ణుడు. ప్రజాహిత నిర్ణయాలకు ప్రతిపక్ష పార్టీగా తాము ఎప్పుడూ అడ్డుపడబోమని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకే ఎదురుతిరుగుతామని యనమల స్పష్టం చేశారు. టీడీపీపై జగన్ మోహన్ రెడ్డి విమర్శలు ఆడలేక మద్దెలోడు చందమే అని అన్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన విధానాలను మార్చుకోవాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమే.. తెలిసే ప్రభుత్వం తప్పుచేసిందన్న దేవినేని..
ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, రాజకీయ ఆరోపణలు చేస్తే పోలవరం పూర్తి కాదని, కేంద్రం చెప్పినా పెడచెవిన పెడుతూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు పెడితే చరిత్ర క్షమించదని దేవినేని ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి గతంలో తాము శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసామని దేవినేని ఉమ గుర్తుచేసారు.
ప్రజల్లో ఎన్నో సందేహాలున్నాయి..పోలవరంపై అఖిలపక్షం ఏర్పాటుచేయాలన్న సీపీఎం నేత మధు..
కాగా పోలవరంపై చెలరేగిన వివాదానం పట్ల సీపీఎం పార్టీ స్పందించింది. పోలవరంపై అఖిలపక్షం ఏర్పాటుచేయాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను బీజేపీ దాట వేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాలు ప్రమాదంలో పడ్డాయని మధు ఆవేదన వ్యక్తం చేసారు. పోలవరం ప్రాజెక్ట్ 56 వేల కోట్ల రూపాయల అంచనాలను అంగీకరించి, ఇప్పుడు నిర్వాసితులతో సంబంధం లేదనడం సరికాదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు బీజేపీ కొమ్ము కాస్తోందని సీపీఎం నేత మధు ఆరోపించారు. ప్రజల్లో ఉన్న సందేహాలు తొలిగి పోవలంటే వెంటనే అఖిల పక్షం ఏర్పాటు చేయాలని మధు డిమాండ్ చేసారు.