రివర్స్ టెండరింగ్ డ్రామా: డ్యామ్ భద్రత తాకట్టు: సీఎంపై టీడీపీ నేతల ఫైర్..!
పోలవరం రివర్స్ టెండరింగ్ లో మేఘా సంస్థ మైనస్ 12.6% కోట్ చేసేలా ప్రభుత్వం ఒత్తిడి చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గతంలో ఆరోపణలు చేసిన సంస్థలను పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. వారికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఈ టెండర్ దాఖలు చేయించారని ఆరోపణలు చేసారు. గత ప్రభుత్వంపై బురదజల్లాలని డ్యామ్ భద్రతను సీఎం జగన్ తాకట్టుపెట్టాడని దుయ్యబట్టారు. కుట్రపూరిత రాజకీయాలతో కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటున్నారని ఉమ మండిపడ్డారు. బిడ్డర్ల పీకమీద కత్తి పెట్టి పోలవరం టెండర్లు వేయించారని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు ఆరోపించారు. ఇదే సమయంలో మంత్రులు మాత్రం ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని..జగన్ సత్తా ఏంటో తెలిసిందని చెబుతున్నారు.
తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?
సీఎం జగన్ పైన టీడీపీ నేతల ఫైర్..
ఏపీ ప్రభుత్వం పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా మేఘా సంస్థ పనులు దక్కించుకుంది. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ.4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా.. మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ.4358 కోట్లకు కోట్ చేస్తూ టెండర్ దాఖలు చేసింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే 12.6% శాతం తక్కువకు మేఘా కోట్ చేసింది. దీంతో పోలవరం కాంట్రాక్టును మేఘా సంస్థ దక్కించుకుంది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే మేఘా సంస్థ పనులను ప్రారంభించనుంది. అయితే, దీని పైన టీడీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్ పైన ఫైర్ అవుతున్నారు. బిడ్డర్ల పీకమీద కత్తి పెట్టి పోలవరం టెండర్లు వేయించారని ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా కుట్రలో భాగంగానే పోలవరం రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. కేంద్రం గైడ్లైన్స్ను తుంగలో తొక్కారని విమర్శించారు. టెండరింగ్ సంస్థకు ముందుగా 150 కోట్లు ఇచ్చారని..తరువాత వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. కేసీఆర్ కనుసన్నల్లో ఏపీ ముఖ్యమంత్రి నడుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు భవిష్యత్ ను తాకట్లు పెడుతున్నారంటూ ఉమా ఆరోపించారు.
టీడీపీపై కక్ష సాధింపు కోసమే..
రివర్స్ టెండరింగ్ డ్రామాను నడపడానికి.. గతంలో జీవో నెం.67 జారీ చేశారని దేవినేని ఉమా గుర్తు చేసారు. ఒకటి కంటే ఎక్కువ సంస్థలు పాల్గొంటేనే.. రివర్స్ టెండరింగ్ ఉంటుందని జీవోలో పేర్కొన్నారని తెలిపారు. గత ప్రభుత్వంపై బురదజల్లాలని డ్యామ్ భద్రతను సీఎం జగన్ తాకట్టుపెట్టాడని దుయ్యబట్టారు. కుట్రపూరిత రాజకీయాలతో కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటున్నారని ఉమ మండిపడ్డారు. టీడీపీపై కక్ష సాధింపు కోసమే రివర్స్ టెండరింగ్ అంటూ టీడీపీ నేత బచ్చుల అర్జునుడు ఆరోపించారు. విమర్శించారు. చారిత్రాత్మక ప్రాజెక్ట్ల విషయంలో తప్పు చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ పరీక్షల్లో పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ.. సీఎం జగన్ సంబంధిత మంత్రులు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. పేపర్ లీక్పై సీబీఐ దర్యాప్తు చేయించాలని బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు.
చంద్రబాబు అవినీతి బయట పడింది..
టీడీపీ నేతల విమర్శలు ఇలా ఉంటే..మంత్రి కన్నబాబు ముందు నుండి చెబుతున్నట్లుగా జగన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని చెప్పుకొచ్చారు. ఒక్క పోలవరం విషయంలోనే దాదాపు 900 కోట్లకు పైగా ఆదా అయిదంటే మిగిలిన ప్రాజెక్టులో ఎంత మేర దోచుకున్నారో తెలుస్తుందని ఆరోపించారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీసారు. మిగిలిన ప్రాజెక్టుల విషయం లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని మంత్రి స్పష్టం చేసారు. ఇప్పటికైనా చంద్రబాబు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో గుర్తించాలని టీడీపీ నేతలకు మంత్రి కన్నబాబు సూచించారు. కాగా..పోలవరం హెడ్ వర్క్స్లో మిగిలిపోయిన పనులతో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి రివర్స్ టెండర్ పిలిచింది. కాగా, తాజా టెండరింగ్తో రూ.628 కోట్లు ఆదా అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది.