జగన్ తిరుమల టూర్పై విన్నూత్న నిరసనలు-పోస్టులో వినతి పత్రాలు-వాట్సాప్లో డిక్లరేషన్లు
ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్లబోతున్న తరుణంలో డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన టూర్ చేపట్టడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. విపక్ష టీడీపీ, బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విన్నూత్నంగా నిరసనలకు దిగుతున్నారు. డిక్లరేషన్ను ఉల్లంఘించి జగన్ తిరుమలకు వెళ్లడంపై వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అన్యమతస్తులు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని విశాఖ జిల్లా నర్సీపట్నం టీడీపీ నేతలు స్పష్టం చేశారు. జగన్ ఇవాళ తిరుమల దర్శనానికి వెళ్తున్న సందర్భంగా జగన్ డిక్లరేషన్ సమర్పించి మా ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత ఉందంటూ టీడీపీ నేతలు పోస్టులో విజ్ఞాపన పత్రాలు పంపించారు. హిందువులైన తాము కూడా అవసరమైతే డిక్లరేషన్ ఇస్తామని, అలాంటిది సీఎం పదవిలో ఉంటూ డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనానికి ఎలా వెళ్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
హిందువులు కాకపోయినా అన్యమతస్తులైనా తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆయన మీద నమ్మకం ఉంటే చాలు అనేలా ఉన్న డిక్లరేషన్ను నింపడానికి జగన్కు ఉన్న అభ్యంతరాలేంటని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. అన్యమతస్తుడైన జగన్ శ్రీవారి దర్శనానికి సనాతన ఆచారాన్ని ధిక్కరించి డిక్లరేషన్ ఇవ్వనంటే ఎలా , ఇందులో నామోషీ ఏముందని ఉమ ప్రశ్నించారు. దీని కోసం ఆధారాలను సైతం కాలరాసే హక్కు జగన్కు ఎవరు ఇచ్చారని ఉమ ఆక్షేపించారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్పై అవగాహన కల్పించేందుకు టీడీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో పీడీఎఫ్ కాపీలను సైతం సర్క్యులేట్ చేస్తున్నారు.