టిడిపి నేతలు సెప్టెంబర్ లోపు అవినీతి కార్యక్రమాలు మానుకోవాలి:జనసేన, లెఫ్ట్ పార్టీల హెచ్చరిక
విజయవాడ:తెలుగుదేశం పార్టీ నేతలు పౌర సేవలను ఆదాయవనరుగా మార్చుకున్నారని...సెప్టెంబర్ లోపు వారుఅవినీతి కార్యక్రమాలు మానుకోవాలని జనసేన, లెఫ్ట్ పార్టీల నాయకులు హెచ్చరించారు. లేదంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు.
విజయవాడ నగర సమస్యలపై జనసేన, లెఫ్ట్ పార్టీలు బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లు కలెక్షన్ ఏజెంట్లుగా మారారని ఆరోపించారు. టీడీపీ నేతలు తాము హెచ్చరించిన మేరకు సెప్టెంబర్ లోపు అవినీతి కార్యక్రమాలు మానుకోకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని మధు హెచ్చరించారు.
అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటానికి ఈ సభతో బీజం పడిందని అన్నారు. విజయవాడలో కొండ ప్రాంత వాసులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి పనులతో టీడీపీ కార్పొరేటర్లు బాగా అభివృద్ధి చెందారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలను దోచుకుతింటున్నారని ఆరోపించారు. అవినీతిపరులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం అదుపులో పెట్టలేకపోతున్నారని రామకృష్ణ విమర్శించారు.
అంతకుముందు శనివారం సిపిఎం రామకృష్ణ జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ''మహాగర్జన''కు మద్దతు తెలిపాలని జనసేన పార్టీ ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(ప్యాక్) సభ్యులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 15న విజయవాడలో జరుప తలపెట్టిన మహాగర్జనకు జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఆహ్వానిస్తున్నట్లు వారితో చెప్పారు.
ఈ నెల 29 న అనంతపురం నుంచి బస్సుయాత్ర ప్రారంభమవుతుందని, అలాగే విశాఖపట్నం నుంచి సెప్టెంబర్ 1న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు బస్సుయాత్ర మొదలవుతుందని ఆయన వారికి వివరించారు. అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు పూర్తయ్యాక సెప్టెంబర్ 15 నాటికి విజయవాడకు చేరుకుని మహాగర్జన సభ నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నాయని, ప్రజలకు మేలు చేసే నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే మహాగర్జన సభను నిర్వహిస్తున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు. జిల్లాల్లో చేపట్టే బస్సుయాత్రలతో పాటు మహాగర్జనకు కూడా జనసేన మద్దతు ఇవ్వాలని వారిని రామకృష్ణ కోరారు.