జగన్ కాశీయాత్రే! బాబు, లోకేష్లపై కుట్రలు మానుకోండి: టీడీపీ నిప్పులు
అమరావతి: ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో మాట్లాడే దమ్ములేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రాల్లో ఏపీ టాప్
జగన్ కాశీయాత్ర వెళ్లాలి..
బుధవారం దేవినేని ఉమ మాట్లాడుతూ.. జగన్ చేష్టలు భరించలేకే ఆ పార్టీలోని 23మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోచేరారని అన్నారు. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదు కాశీ యాత్ర అని ఎద్దేవా చేశారు. జగన్ తన పాదయాత్రలో ఏ సమస్యా ప్రస్తావించడం లేదని, ఆయన ప్రసంగమంతా చంద్రబాబును తిట్టడం కోసమేనని దేవినేని విమర్శించారు.
బీజేపీ తప్పుడు కూతలు
ఇది ఇలా ఉండగా, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. అమరావతి బాండ్లు సహా ఏ అంశంపైనైనా జీవీఎల్తోపాటు బీజేపీ నేతలతో బహిరంగ చర్చ జరిపేందుకుక సిద్ధమేనని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన అమరావతి బాండ్లలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదన్నారు. రామాయపట్నం, దుగరాజపట్నం ఓడరేవుల నిర్మాణం విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మౌనం పాటిస్తున్నారని బోండా ఉమ ప్రశ్నించారు.
బాబు, లోకేష్పై కుట్రలు..
ఏపీలో ఐటీ కంపెనీల పేరుతో అక్రమాలు జరిగాయంటూ మాజీ న్యాయాధికారి శ్రవణ్ కుమార్ వేసిన పిల్ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు వ్యతిరేకంగా దాఖలైన ఆ పిల్ను కోర్టు కొట్టివేయడంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. ఆధారాల్లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు, లోకేష్ను అపఖ్యాతి పాల్చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.
ఇంకా బుద్ధి రావట్లేదు..
రాజకీయ లబ్ధి కోసమే కోర్టులను ఉపయోగించుకోవాలనే ప్రయత్నం సరికాదన్నారు. ఇప్పటికే చంద్రబాబుపై వేసిన అనేక కేసులు తప్పుడు కేసులని తేలాయని, అయినా కొందరికి బుద్ధి రావట్లేదని కనకమేడల వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులతో ఒరిగేదేమీ లేదని గ్రహించాలని కనకమేడల రవీంద్రకుమార్ హితవు పలికారు.