'మీకు తిరస్కారం తప్పదు, పవన్ కళ్యాణ్! అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు'
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, బీజేపీపై తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం మండిపడ్డారు. కేంద్రం కుట్రలో పవన్, జగన్ సూత్రధారులు, పాత్రధారులు అని బుద్ధా వెంకన్న అన్నారు. అభివృద్ధిని వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని దుష్టశక్తులు చంద్రబాబుపై కుట్ర చేస్తున్నాయన్నారు.
చంద్రబాబుపై ఏ1, ఏ2లైన జగన్, విజయసాయి రెడ్డిలు విమర్శలు చేయడం దారుణం అన్నారు. మట్టి తవ్వకాల్లో రూ.33 వేల కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపించడం సరికాదన్నారు. జగన్, వైసీపీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఖనిజ సంపద దోచుకున్న వ్యక్తి జగన్ అన్నారు.
పవన్, కన్నా, జగన్లకు ప్రజల తిరస్కారం తప్పదు
మోడీని విమర్శించక పోవడాన్ని బట్టే బీజేపీ, వైసీపీ మధ్య లాలూచీ ఉందని చెప్పడానికి మంచి నిదర్శనం అని బుద్ధా అన్నారు. ఏపీపై కేంద్రం చేస్తున్న కుట్రలో జగన్, పవనలు పాత్రధారులు కావడం బాధాకరమన్నారు. 2019 ఎన్నికల్లో జగన్, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మినారాయణలకు ప్రజల తిరస్కారం తప్పదన్నారు. మరో మాజీ ఐపీఎస్ అధికారి కూడా తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు.
కేంద్రం చేస్తున్న కుట్రలు ప్రజల్లోకి తీసుకెళ్లాం
నాలుగేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. నవ నిర్మాణ దీక్షలతో బాధ్యతలను గుర్తు చేస్తూ, ఢిల్లీ పెద్దలు చేస్తోన్న కుట్రలను ప్రజలకు వివరించామన్నరు. చట్టంలో పేర్కొన్న విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహా సంకల్పం ఉపయోగపడిందన్నారు. రాజమండ్రి వేదికగా మూడో ధర్మపోరాట దీక్ష నిర్వహించాలని, ఆ తర్వాత రాయలసీమలో ఇంకో సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. యూనివర్సిటీలలో మరో 10 సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామదర్శిని పేరుతో గ్రామాల్లోకి వెళ్లాలన్నారు. దళిత తేజం ముగింపు సభ నెల్లూరులో నిర్వహిస్తామన్నారు.
పవన్ అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు
ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ అవినీతి ఆరోపణలు చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కాల్వ మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ కలిసి చేస్తోన్న కుట్రలను ఎండగట్టానున్నామన్నారు. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకున్నారన్నారు. నిరాధారమైన ఆరోపణలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పవన్కు హితవు పలికారు. కేంద్రం అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకొనే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల పనితీరుపై జాతీయస్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా బ్యాలెట్ను ఉపయోగిస్తున్నారని, మొదటి నుంచి టీడీపీ బ్యాలెట్ సరైందని చెబుతోందన్నారు. మరో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఇళ్ల గురించి బీజేపీ నేతలు వక్రీకరించి చెప్పడం దారుణం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
బీజేపీ ఆగ్రహం
ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు తాము చేపట్టిన ధర్నాను టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. తాము ధర్నా చేస్తున్నచోట టీడీపీ ధర్నా చేసేందుకు రావటం దౌర్జన్యం అన్నారు. కేంద్రం పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగించడం లేదన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని కాగ్ కూడా తప్పుపట్టిందని, ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్న బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అడుగుకు రూ.1200తో నిర్మాణం చేస్తుంటే ఏపీలో అడుగుకు రూ.2400 ఖర్చు చేస్తున్నారన్నారు. బుద్దా వెంకన్న శాంతిభద్రతలకు వ్యతిరేకంగా వ్యవహరించినా ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు.