సీబీఐ ఎంట్రీపై టీడీపీ నేతల్లో టెన్షన్ .. చంద్రబాబుకు,లోకేష్ కు ఉచ్చు బిగుస్తుందా ?
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను టార్గెట్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తూ ప్రభుత్వానికి షాక్ ఇస్తుంటే, మరొకపక్క అధికారపార్టీ టిడిపి హయాంలో జరిగిన కుంభకోణాలను బయటకు తీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాజధాని అమరావతి భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసిన ఏపీ సర్కార్, ఇప్పుడు తాజాగా చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ నెట్,సెటాప్ బాక్స్ ల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని, సుమారు ఫైబర్ నెట్ లోనే 700 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని నిర్ధారించిన ఏపీ కేబినెట్ ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఊహించని నిర్ణయం టిడిపి నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
కర్మ కాలి జగన్ సీఎం అయ్యారు..ఏడాది పాలన బాగోలేదని మీ వాళ్ళే చెప్తున్నారు :టీడీపీ నేతల ధ్వజం
ఫైబర్ గ్రిడ్ కేసు లోకేష్ మెడకు చుట్టుకునే దాకా రావచ్చన్న టెన్షన్ లో టీడీపీ
ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తమపై దాడులు పెరిగిపోయాయని ,అధికార వైసీపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు, ఇక ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఫైబర్ గ్రిడ్ కేసు లోకేష్ మెడకు చుట్టుకునే దాకా రావచ్చని టిడిపినేతలలో ఆందోళన మొదలైంది.టిడిపి నేతలు చాలామంది జగన్ జైలు జీవితాన్ని పదే పదే ప్రస్తావిస్తూ, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో,టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని నిరూపించి టిడిపి నేతలను జైలుకు పంపించే వరకు వైసీపీ సర్కార్ నిద్రపోయేలా లేదు అనే భావన తాజా పరిణామాల నేపథ్యంలో వ్యక్తమౌతుంది.
సీబీఐని రంగంలోకి దించి టీడీపీని ఇరకాటంలో పెట్టనున్న జగన్
ప్రతి చిన్నవిషయంలోనూ ఎదురు దాడి చేస్తున్న టిడిపిని,ఇలా అవినీతి అక్రమాల వ్యవహారాల్లో గట్టిగా ఇరికించాలని వైసీపీ సర్కార్ సీబీఐని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు సీనియర్ టిడిపి నేతలు రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సహజమని,కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు అందుకు భిన్నంగా ఉంది అని అంటున్నారు. నాడు టిడిపి ప్రభుత్వం చేసిన ప్రతి పనిలోనూ అవినీతిని, అక్రమాలను వెతకడం,ఆరోపణలు చేయడం వైసిపి సర్కార్ కు అలవాటైపోయింది అని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక అంతే కాదు సొంత బాబాయి మర్డర్ జరిగి ఇంతకాలమైనా ఆ కేసును సీబీఐకి అప్పగించాలి అన్న ఆలోచన జగన్ కు లేదని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ సహకారం వైసీపీ ప్రభుత్వానికి ఉందా అన్న అనుమానం
మరో కొత్త అనుమానం కూడా టిడిపి నేతల్లో వ్యక్తమవుతోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందేమో అన్న అనుమానం కూడా కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద యుద్ధం చేయడం,ఇక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలు కావడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు అనవసరంగా చంద్రబాబు బీజేపీతో పెట్టుకున్నారనే భావన వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలలో కేంద్రంలోని బీజేపీపెద్దల సహకారం ఉందేమో అన్న అనుమానాలు కూడా కొంతమంది నేతలకు లేకపోలేదు.ఏదేమైనా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో టిడిపి అప్రమత్తం కావాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎన్నికల ఓటమి నుండి టీడీపీకి అంతా కష్టకాలమే
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బ తిన్నాడు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోర ఓటమిని చవిచూసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి,టీడీపీని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు. ప్రజా వేదిక కూల్చివేత నుంచి మొదలుపెడితే, రాజధాని అమరావతి వ్యవహారంతో సహా ఇప్పటివరకూ టార్గెట్ టీడీపీ అంటున్న వైసిపి ప్రభుత్వం చంద్రబాబు మెడకు,లోకేష్ మెడకు గట్టిగానే ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలంటూ ప్రతి విషయానికీ అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న టీడీపీని, గత పాలనలో చేసిన అవినీతి బాగోతాలను బయటకు తీస్తూ వైసీపీ టార్గెట్ చేస్తోంది.
చాలా మంది పార్టీకి దూరంగా ..కీలక టీడీపీ నేతలు ఇప్పటికే సైలెంట్ ..
ఇక ఇప్పటికే నాడు టిడిపి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రులు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి నేటికీ నోరుమెదపని పరిస్థితిలో ఉన్నారు. ఇక రాజ్య సభ సభ్యులు మూకుమ్మడిగా టీజీ వెంకటేష్ ,సీఎం రమేష్ ,సుజనా చౌదరి వంటి నేతలు సేఫ్ సైడ్ చూసుకున్నారు. బీజేపీ పంచన చేరారు. ఇక గంటా శ్రీనివాసరావు, నారాయణ తదితరులు పార్టీ కోసం మాట్లాడటం మానేసి చాలా కాలం అయ్యింది. ఇక వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటి నేతలు కూడా టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ టిడిపికి దూరంగా కొనసాగుతున్నారు.
Recommended Video
జగన్ దూకుడుకు టీడీపీ నేతల్లో భయం .. చంద్రబాబు పార్టీని , నేతలను కాపాడుకోవాల్సిన సమయం
ప్రస్తుతం దేవినేని ఉమా,అచ్చె న్నాయుడు,గోరంట్ల బుచ్చయ్య చౌదరి,వర్ల రామయ్య,యనమల,అయ్యన్నపాత్రుడు వంటి కొందరు నేతలు మాత్రమే టిడిపి తరఫున తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయాలతో ముందు ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అన్న భయం టిడిపి నేతలకు పట్టుకుంది. ఏదేమైనా టిడిపి నేతలు అప్రమత్తం అవ్వాల్సిన సమయం, చంద్రబాబుపార్టీ నేతలను, పార్టీని కాపాడుకోవాల్సిన సమయమిది అని తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల నుండి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.