దేవినేని ఉమా, వర్ల రామయ్య హౌస్ అరెస్ట్: టీడీపీ నిరసనల పర్వం: అంబేద్కర్, ఫులే విగ్రహాలకు
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభా పక్ష ఉపనేత, కార్మిక శాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంపై టీడీపీ నేతల్లో ఆగ్రహజ్వాలలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలను చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాఫులే విగ్రహాలకు వినతిపత్రాను అందజేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి.
వర్ల రామయ్య, దేవినేని ఉమా గృహ నిర్బంధం
అచ్చెన్నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు తలపెట్టిన నిరసన ప్రదర్శనలు, వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడానికి సిద్ధపడిన సీనియర్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. హౌస్ అరెస్టు చేశారు. జల వనరుల శాఖ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, పార్టీ పొలిట్ బ్యుూరో సభ్యుడు, రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
వైఎస్ జగన్ బీసీ, దళిత వ్యతిరేకి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ, దళిత వ్యతిరేకి అని దేవినేని ఉమామహేశ్వర రావు, వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని, పోలీసుల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. బీసీలను రాజకీయంగా సహా అన్ని అన్ని రంగాల్లోనూ అణచివేయడంలో భాగంగా ఆయనను అరెస్టు చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జగన్ ప్రభుత్వం బరితెగించిందని నిప్పులు చెరిగారు.
విశాఖలో మాజీ ఎమ్మెల్యే అరెస్టు
టీడీపీకి చెందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావును పోలీసులు అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా గాజువాకలో భారీ ఎత్తున వ్యతిరేక ప్రదర్శనలను ఆయన నిర్వహించారు. అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. గాజువాక పార్టీ నాయకులు, కార్యకర్తలు, తన అనుచరులతో పల్లా శ్రీనివాసరావు ఈ ఉదయం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. గాజువాక జంక్షన్ వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
ఏం తప్పు చేశారని అరెస్టులు..
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు పోలీసులతో గొడవ పడ్డారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించే హక్కు తమకు ఉందని వాగ్వివాదానికి దిగారు. అకారణంగా బీసీ నాయకుడు అచ్చెన్నాయుడిని ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఆయనను వెంటనే విడుదల చేయాలని నినదించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా.. ప్రతిఘటించారు. ఫలితంగా గాజువాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
అంబేద్కర్, ఫులే విగ్రహాలకు వినతిపత్రాలు..
అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ అనుబంధ విభాగాల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు దిగారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాఫులే విగ్రహాలకు వినతిపత్రాలను అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగ దొక్కేస్తోందని ఆరోపించారు. అచ్చెన్నాయుడి అరెస్టు దీనికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని వారు అంబేద్కర్, ఫులే విగ్రహాలకు వినతిపత్రాలను అందజేశారు.
నేను బీసీనే నన్నూ అరెస్టు చేయండి..
నేను బీసీనే నన్నూ అరెస్టు చేయండి.. నేను ఎస్సీనే నన్ను అరెస్టు చేయండి అనే నినాదాలతో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలు రాష్ట్రాన్ని హోరెత్తిస్తున్నాయి. వాటికి సంబంధించిన ప్లకార్డులను పట్టుకుని నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు ఆయా విభాగాల నాయకులు. తప్పు చేయకపోయినా అచ్చెన్నాయుడిని ప్రభుత్వం అరెస్టు చేసిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.