రాజధానిని కదిలిస్తే రాష్ట్రం అగ్నిగుండమే: కమిటీకి చట్టబద్ధత లేదు: టీడీపీ నేతల ఫైర్..!
ఏపీ రాజధానిపైన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు..దీనికి అనుగుణంగానే జీఎన్ రావు కమిటీ నివేదికతో ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇదే సమయంలో రాజధాని ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సైతం మండిపడుతున్నారు. జీఎన్ రావు కమిటీ ఏపీకి మూడు రాజధానులు..నాలుగు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటుకు సిఫార్సు చేయటం ద్వారా..అసలు ఈ కమటీకి ఉన్న చట్టబద్దత ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమతో సంప్రదింపులు జరిపామని జీఎన్ రావు చెప్పటాన్ని రాజధాని రైతులు తప్పుబడుతున్నారు. తమతో ఎటువంటి అభిప్రాయ సేకరణ చేయలేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక, అమరావతి రైతులకు మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని ఆ ప్రాంత టీడీపీ నేతలు నిర్ణయించారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు
అగ్నిగుండంగా మారుతుంది..
అమరావతి నుంచి రాజధానిని కదిలించడానికి వీల్లేదని... కదిలిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హెచ్చరించారు. రాజధానిని తరలిస్తే రాష్ట్ర ప్రజల కోపంలో..ఆందోళనలో.. ఆవేదనలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. రాజధానిని అమరావతి నుంచి తొలగించే దుస్సాహసం చేస్తే రాబోయే విపత్కర పరిస్థితులకు సీఎం.. ఈ ప్రభుత్వమే బాధ్యత వహిం చాల్సి ఉంటుందన్నారు. రాజధానిపై నెలకొన్న గందరగోళాన్ని సీఎం తొలగించాలని కోరారు. కులాలు, పార్టీలకు అతీతంగా రాజధాని ప్రాంతంలో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారన్న వర్ల రామయ్య తాడికొండ శాసనసభ్యురాలు జనాన్ని చూసి నియోజకవర్గానికి రాకుండా పారిపోయారు.
కమిటీకి చట్టబద్దత లేదు..
రాజధాని పైన కీలక సూచనలు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పైన మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. జగన్ది తుగ్లక్ పాలన అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. జీఎన్ రావు కమిటీకి చట్టబద్ధత లేదని చెప్పారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చెల్లదని తెలిపారు. అయినా కమిటీ కూడా రాజధాని మార్చాలని చెప్పలేదని వెల్లడించారు. విశాఖలో జగన్ 6 వేల ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన తర్వాతే.. రాజధాని మార్పు అంటూ ప్రకటన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఉమా రాజధాని తరలింపును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనల్లో ఉమా పాల్గొన్నారు.
రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళన
ఇక, రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కమిటీ నివేదిక ప్రకటన తరువాత ఒక్క సారిగా వారంతా సచివాలయం వైపు దూసుకొచ్చారు. జగన్ ఫ్లెక్సీలను చించేసారు. ముఖ్యమంత్రి.. జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. అమరావతిని రక్షిస్తాం అంటూ నినాదాలు చేస్తున్నారు. మంత్రి బొత్సా రాజధాని రైతులకు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెబుతున్నా.. రైతులు శాంతించటం లేదు. ఈ రోజు సైతం ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు.