ఎమ్మెల్యేను బట్టలిప్పి కొడుతామన్నారట : అత్తార్ భాషాకు టీడీపీ స్ట్రోక్
అనంతపురం : అధికార పార్టీలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లిన కొంతమంది నేతలకు సొంత గూటి నేతలతో ఏమాత్రం పొసగడం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు ముసురుకుంటున్నాయి. తామే పైచేయిగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది టీడీపీ నేతలు వైసీపీ నుంచి కొత్తగా టీడీపీలోకి వచ్చినవారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
తాజాగా ఇదే పరిస్థితిని ఎదర్కొంటున్నారు అనంతపురం కదిరి ఎమ్మెల్యే అత్తార్ భాషా. వైసీపీ నుంచి టీడీపీ చేరిలో ఆయన పట్ల టీడీపీ నేతలు అంటీముట్టనట్టుగానే వ్యవహిరిస్తున్నారు. అంతేకాదు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోను అత్తార్ భాషాకు అవమానాలే ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కదిరిలో నిర్వహించిన మినీ మహనాడులో పాల్గొనాలకున్న అత్తార్ భాషా కు టీడీపీ నేతలు గట్టి హెచ్చరికలే జారీ చేసినట్టుగా సమాచారం. మహానాడులో పాల్గొంటే బట్టలు విప్పి మరీ కొడుతామంటూ జిల్లా ఇంఛార్జీ కందికుంట ప్రసాద్ అనుచరులు బెదిరింపులకు దిగడంతో.. మహానాడుకు దూరంగా ఉండడమే బెటర్ అని భావించారట అత్తార్ భాషా.
అయితే.. నియోజకవర్గంలోనే ఉండి మహానాడుకు హాజరుకాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన ఎమ్మెల్యే అత్తార్ భాషా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. హెచ్చరికలకు భయపడి అత్తార్ భాషా అనుచరులు కూడా మహానాడు వైపు తొంగి చూడలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే అంతకుముందు జరిగిన ఓ సమావేశంలోను ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, అత్తార్ భాషా పై ప్రత్యక్ష ఆరోపణలకు దిగి ఆయన్ను అవమానించారు. పదేళ్లు ఓపిగ్గా ప్రతిపక్షంలో కూర్చుని తిరిగి అధికారంలోకి వచ్చామని, కొంతమందికి రెండేళ్లు కూడా వేచి చూసే ఓపిక లేక అధికార పార్టీలోకి వచ్చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దీంతో సమావేశానికి హాజరైన అత్తార్ భాషా తీవ్ర అసహనానికి లోనయ్యారు.
ఏదేమైనా ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు బెదిరింపులకు పాల్పడడం, పైచేయి సాధించాలనే ధోరణితో వ్యవహరించడం పార్టీకి నష్టాన్నే మిగులుస్తాయంటున్నారు పలువురు.