టీడీపీ..ర్యాలీగా అసెంబ్లీకి: 2కిలోమీటర్ల పాటు: జగన్ సర్కార్పై నిప్పులు.. !
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి నిరసనగా కొద్దిరోజులుగా అమరావతి ప్రాంత రైతులతో కలిసి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తూ వస్తోన్న తెలుగుదేశం పార్టీ.. అసెంబ్లీ సమావేశాలపైనా అదే ఊపును ప్రదర్శించింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరు కావడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రదర్శనగా తరలి వెళ్లారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఈ ర్యాలీ కొనసాగింది.
చంద్రబాబు సారథ్యంలో..
ఈ ప్రదర్శనకు తెలుగుదేశం పార్టీ సభాపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యాన్ని వహించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ, బెందాళం అశోక్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ నారా లోకేష్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారంతా అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. అమరావతిలో రాజధానిని కొనసాగించాలంటూ బ్యానర్లను ప్రదర్శించారు.
పోలీసుల జులుం నశించాలంటూ..
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అసెంబ్లీకి వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున పోలీసుల బలగాలను మోహరింపజేసింది. ప్రదర్శన కొనసాగుతున్నంత సేపూ టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అనుసరిస్తూనే వచ్చారు. మార్గమధ్యలో కొందరు నాయకులు టీడీపీ ఎమ్మెల్యేల ప్రదర్శనలో పాలుపంచుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న తరువాత కూడా పోలీసులు వారిని ఎటూ కదలనివ్వలేదు. రైతులను ఉద్దేశించి మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించినప్పటికీ.. ఆ వీలు కల్పించలేదు.
అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయింపు..
ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్న అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. మూడు రాజధానుల వల్ల ఒరిగేదేమీ ఉండదని, తన రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఒంటెత్తు పోకడలను అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానికి భూములను ఇచ్చిన రైతుల త్యాగాలను హేళన చేస్తోందని మండిపడ్డారు. అనంతరం సమావేశాలకు హాజరయ్యారు.
అసెంబ్లీ ముట్టడిలో మాజీ ఎమ్మెల్యేలు..
తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావు, ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ చౌదరి, బోండా ఉమా మమహేశ్వరరావు వంటి మాజీ ఎమ్మెల్యేలు బైక్ ర్యాలీలను నిర్వహించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు కొనసాగిస్తోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు సోమవారం నాటికి పతాకస్థాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ, అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఇచ్చిన పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి ఆందోళనను చేపట్టాయి.