ఐటీ దాడులకు టీడీపీకి ముడి పెట్టటం కక్ష సాధింపులో భాగమే: మండిపడిన అచ్చెన్నాయుడు
ఏపీలో జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వద్ద పని చేసిన పీఏ దగ్గరే 2 వేల కోట్లు వెలుగు చూసాయంటే ఇక చంద్రబాబు దగ్గర వెతికితే రెండు లక్షల కోట్లు వెలుగు చూస్తాయని వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక వారి ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పి కొడుతున్నారు.
రాజకీయ రంగు పులుముకున్న ఐటీ రైడ్స్
ఏపీలో సంచలనంగా మారిన ఐటీ రైడ్స్ రాజకీయ రంగు పులుముకున్న నేపధ్యంలో నేతలు ఒకరిమీద ఒకరు ఎదురు దాడి చేసుకుంటున్నారు . తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఐటీ సోదాల్లో.. 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఐటీ శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చెయ్యటం తో ఇక దుమారం మొదలైంది. వైసీపీ నేతలు టీడీపీ నేతలు, చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక టీడీపీ నేతలు దీనిని ఖండిస్తూ వైసీపీ నేతలపై భగ్గుమంటున్నారు.
వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఆరోపణలు
అయితే ఈ ఐటీ దాడులకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక ఈ దాడులను టీడీపీకి ముడిపెట్టడంపై అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలొ మండిపడుతున్నారు. వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగం అని ఆయన ఈ దాడులను అభివర్ణించారు . టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బురద జల్లేందుకే ఈ దాడులను అస్త్రంగా చేసుకున్నారన్న అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించే యత్నం చేస్తుందని , ప్రజలను మసిపూసి మారేడు కాయ చేస్తుందని ఆయన విమర్శించారు .
జగన్ అక్రమాస్తుల కేసుపై నోరు మెదపరెందుకని ప్రశ్నించిన అచ్చెన్న
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ జగన్ అని పేర్కొన్న అచ్చెన్న జగన్ అక్రమాస్తులపై సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్పై వైసీపీ నేతలు ఎందుకు నోరు తెరవరని ప్రశ్నించారు. చంద్రబాబుపై 26కు పైగా విచారణలు జరిపించినా ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అటువంటి తప్పుడు ఆరోపణలనే చేస్తున్నారని వైసీపీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు .