కుప్పంలో ఓడిపోతాం - ఇదీ కారణం : లోకేష్ కు కార్యకర్త షాక్..!!
కుప్పంలో పార్టీ పరిస్థితి పైన పార్టీ కార్యకర్త లోకేష్ కు షాక్ ఇచ్చారు. పరిస్థితి బాగోలేదని చెప్పారు.
పాదయాత్ర వేళ లోకేష్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించారు. తొలి రోజున లోకేష్ పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు భారీగా తరలి వచ్చారు. కుప్పంలో ప్రారంభమైన యాత్ర రేపటి వరకు కొనసాగనుంది. మొత్తం నాలుగు వందల రోజుల పాటుగా నాలుగు వేల కిలో మీటర్ల మేర లోకేష్ యాత్ర కొనసాగనుంది.
లోకేష్ తన పాదయాత్ర వేళ నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో..కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపైన ఆరా తీస్తున్నారు. కుప్పంలో ఇటువంటి కార్యక్రమంలోనే పార్టీ కార్యకర్త నుంచి అనూహ్య ఘటన ఎదురైంది.
కుప్పం నియోజకవర్గంలో లోకేష్ ముఖా ముఖి నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పైన కార్యకర్తలు ఓపెన్ గా తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్న ఆ సభలో ఓ కార్యకర్త నియోజకవర్గంలో పరిస్థితుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
కార్యకర్త భానుమూర్తి టీడీపీ అధికారంలో ఉన్నప్పడు తమ సామాజికవర్గం (వన్నెకుల క్షత్రియ-బీసీ) సంక్షేమానికి కృషి చేయలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఇప్పించేందుకు ఏ నాయకుడూ సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంపై అగ్రనేతలు ఇచ్చిన ఎలాంటి నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని లోకేశ్ ను భాముమూర్తి అభ్యర్థించాడు.
లోకేష్ కు షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్త..!! pic.twitter.com/jpMWNUVcI1
— oneindiatelugu (@oneindiatelugu) January 29, 2023
కుప్పంలో అంతా ఓకే అని మన నాయకులు చెబుతున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా భిన్నంగా ఉందని వివరించారు. గెలిచే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. ఆ కార్యకర్త మాట్లాడుతున్న సమయంలోనే లోకేష్ వెంటనే జోక్యం చేసుకున్నారు. గ్రౌండ్ రిపోర్టు బాగోలేదని ఎలా చెప్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
దీనిపై మరింత విసుగు చెందిన నారా లోకేశ్.. వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ వనితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వనిత ఇంతవరకు ఏమి పీకారని కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ గ్రౌండ్ రిపోర్టు బాగోలేదని చెబితే బాగుందని..కానీ, మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని లోకేష్ మందలించారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.