జనసేనకు దగ్గరవ్వాలని చూస్తున్న టీడీపీ: పవన్ లాంగ్ మార్చ్ పై తెలుగు తమ్ముళ్ళ వ్యూహం ఇదేనా ?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్నిఎదుర్కోవడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు విశాఖ వేదికగా నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ వేదికగా తన వ్యూహాన్ని అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి టిడిపి శక్తి చాలడం లేదని భావించి, జనసేన పైన దృష్టి సారించారు చంద్రబాబు.
జగన్ సర్కారు కొత్త జీవో: 'స్వేచ్ఛ'కు సంకెళ్లంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫైర్
అధికార పార్టీపై ఒంటరి పోరాటం చేస్తున్న టీడీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో అధికార పార్టీపై పోరాటం సాగిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టిడిపి శ్రేణులపై దాడులు, నాయకులపై కేసులు వంటి చర్యలతో అణచివేతకు గురి చేస్తుండటం తెలుగుదేశం పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక టీడీపీ లో ఉంటే వేధింపులు ఉంటాయని భావించి చాలామంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వెళుతున్న పరిస్థితి. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే నలుగురు ఎంపీలు బిజెపి బాట పట్టగా, ఇప్పుడు ఎమ్మెల్యేలు సైతం టీడీపీని వదిలి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
టీడీపీ,బీజేపీలను సమిష్టిగా కార్మికుల కోసం పోరాటం సాగిద్దామని కోరిన పవన్ కళ్యాణ్
ఇక ఇదే సమయంలో ఏపీలో తీవ్రంగా నెలకొన్న ఇసుక కొరత ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్న తీరు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు ప్రతిపక్షాలను పోరుబాట పట్టించాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్మాణ రంగ కార్మికులకు మద్దతుగా ఇసుక కొరత కు నిరసనగా లాంగ్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సమిష్టిగా పోరాటం చేస్తే ఫలితం ఉంటుందని కలిసి పోరాదదామని బీజేపీని , టీడీపీని కోరారు పవన్ .
నో అన్న బీజేపీ ... అవకాశం వాడుకునే ఆలోచనలో టీడీపీ
ఏపీలో నెలకొన్న ఇసుక సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం సాగించాలని భావించిన పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కోరారు. అంతే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీ నో చెప్పగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకుంటున్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయడానికి తమ ఒక్కరి శక్తి సరిపోదని భావించి, జనసేన మద్దతు కోసం బాబు వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తున్నారు.
జనసేనతో కలిసి విశాఖ లాంగ్ మార్చ్ లో టీడీపీ
జనసేనకు మళ్లీ దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు లాంగ్ మార్చ్ ఒక అవకాశాన్ని ఇచ్చింది. తద్వారా బలమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన మద్దతు గా ఉంటే, వామపక్షాలతో కూడా సఖ్యత నెలకొంటుంది అని భావిస్తున్నారు. ఇక జనసేన పార్టీకి మొదటి నుంచి పెద్ద సపోర్ట్ గా ఉన్న యువత మద్దతు కూడా టీడీపీకి అందుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 3వ తేదీన విశాఖలో జరగనున్న లాంగ్ మార్చ్ ద్వారా జనసేన తో కలిసి ఇసుక పై పోరాటం సాగించడానికి, జనాల్లోకి వెళ్లడానికి టిడిపి సిద్ధమవుతున్నట్లుగా తాజా పరిణామాల ద్వారా తెలుస్తుంది. బిజెపి ని మద్దతు కోరినా ససేమిరా అనడంతో ఇక టీడీపీ జనసేన తో కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల్లో ఒంటరి పోరాటమే కొంప ముంచిందన్న భావనలో టీడీపీ, జనసేన
గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి సాగితే జనసేన పార్టీకి ఉనికి ఉండదని భావించి జనసేన పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. ఒకే స్థానానికి పరిమితమైంది. ఇక టిడిపి సైతం 2014 ఎన్నికల్లో జనసేన మద్దతు ఇవ్వడం వల్ల విజయం సాధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేసి చావు దెబ్బ తింది. ఊహించని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో విజయకేతనం ఎగురవేసి తన సత్తా చాటింది. ఒంటరిగా ఎన్నికల్లో కి దిగడం వల్లే దెబ్బతిన్నామని భావించిన టిడిపి, జనసేనలు ఇప్పుడు ఏపీలో బలంగా ఉన్న అధికార పార్టీని ఎదుర్కోవడానికి, సమస్యలపై పోరాటం చేయడానికి కలిసి సాగాలని నిర్ణయం తీసుకున్నాయి.
అధికార పార్టీని ఎదుర్కోటానికి బలమైన ప్రతిపక్ష కూటమే ప్రత్యామ్నాయం అనే లెక్కలో టీడీపీ
అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతుతో జనసేన బలోపేతంగా ముందుకు వెళ్లాలని, దూకుడు చూపించాలని భావిస్తుంది. ఇక టిడిపి సైతం అదే ప్లాన్లో జనసేన తో కలిసి ముందుకు సాగితే , బలమైన ప్రతిపక్ష కూటమిగా అధికార పార్టీని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి సమకూరుతుందని భావిస్తుంది . ఏదేమైనా ఒంటరి పోరాటం చేస్తున్న టిడిపికి, లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆఫర్ బంపర్ ఆఫర్ అని చెప్పాలి. అటు జనసేన, టిడిపి, వామపక్షాలు కలిసి సాగించే సమరం అయిన నవంబర్ 3వ తేదీన నిర్వహించే లాంగ్ మార్చ్ తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలలో ఏ విధమైన మార్పులు వస్తాయి అన్నది ఆసక్తికర అంశమే.