బాబుకు భారీ ఝలక్ : లంకె స్రవంతి అలా ఎందుకు చేసింది!?
విజయవాడ : టీడీపీ నేతగా మహిళా కౌన్సిలర్.. వైసీపీ అభ్యర్థికి ఓటేయడంతో కృష్ణా జిల్లాలోని పెడన మున్సిపల్ చైర్మన్ పదవిని చేజార్చుకుంది అధికార పార్టీ. అంతర్గత కారణాలో.. పార్టీలో గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తో! తెలియదు గానీ మొత్తానికి ఎన్నిక చివరి నిమిషయంలో కౌన్సిలర్ లంకె స్రవంతి వైసీపీకి మద్దతు పలికి టీడీపీకి ఊహించని ఝలక్ ఇచ్చారు.
దీంతో ప్రతిపక్షానికి అమ్ముడుపోయిందని అధికార పార్టీ వాళ్లు ఆరోపిస్తుండగా.. అధికార పార్టీ తీరును, స్థానిక ఎమ్మెల్యే పనితీరును ఎండగుడుతోంది లంకె స్రవంతి. కాగా, లంకె స్రవంతి వైసీపీకి మద్దతు పలకడంతో.. వైసీపీ అభ్యర్థి బూసం ఆనందప్రసాద్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైసీపీ ఓటు కలుపుకుని ఆయనకు 12మంది కౌన్సిలర్ల మద్దతు లభించగా.. టీడీపీకి 11మంది మద్దతు మాత్రమే లభించడంతో చైర్మన్ పదవిని చేజార్చుకుంది.
మున్సిపల్ చైర్మన్ పదవిలో కొనసాగుతుండగానే గత చైర్మన్ ఎర్రా శేషగిరిరావు మృతి చెందడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. పెడనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులోను మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగ్గా.. కౌన్సిలర్ జొన్నలగడ్డ సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీడీపీ పట్టించుకున్న పాపాన పోలేదు.. అందుకే ఇలా : లంకె స్రవంతి
వైసీపీకి అమ్ముడపోయినందు వల్లే టీడీపీకి మద్దతు తెలపలేదని లంకె స్రవంతిపై విమర్శలు గుప్పిస్తోన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కాగితపు సుబ్బారావుల వ్యాఖ్యలను తిప్పికొట్టారామె. వార్డు సమస్యల గురించి ఎన్నిసార్లు మున్సిపల్ చైర్మన్ కు, సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని స్రవంతి వాపోయారు.
ఆఖరికి తన ఇంటిలో కుళాయి పెట్టించుకోవడం కోసం కూడా అధికారుల చుట్టూ ఆరునెలల పాటు ప్రదక్షిణలు చేశానని అయినా ఫలితం లేకపోయిందని చెప్పుకొచ్చారు. తన వార్డుకు అసలు నిధులు కేటాయించలేదని, ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. వైసీపీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తాను వైసీపీకి ఓటుకు వేశానని స్రవంతి పేర్కొన్నారు.
తమ ఎమ్మెల్యే కాగితపు వెంకట్రావుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు లంకె స్రవంతి. ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు తప్పించి ఆయన మరెక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్ ను ఆదర్శంగా తీసుకునే వైసీపీని గెలిపించడానికి పూనుకున్నట్టు స్రవంతి తెలిపారు. అమ్ముడుపోయానని టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. ఇలాంటి దుష్ప్రచారాల వల్లే ఆత్మగౌరవం దెబ్బతిని పార్టీలు మారే పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు.