ప్రారంభమైన టీడీపీ మహానాడు...ఎన్నికల సమాయత్తమే ప్రధాన లక్ష్యం
విజయవాడ:పార్టీ ప్రతినిధుల నమోదుతో టీడీపీ 34 వ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఈ మహానాడును నిర్వహిస్తోంది.
ఆరంభ దినాన సుమారు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నట్లు సమాచారం. ఈ మహానాడులో మొత్తం 34 తీర్మానాలపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇందులో ఏపీ తీర్మానాలు-22 కాగా, తెలంగాణకు సంబంధించి 8, ఉమ్మడి తీర్మానాలు 4 ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎపీలో జరిగిన...జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా ప్రత్యేక చర్చ ఉంటుందని తెలిసింది.
మరిన్ని...చర్చనీయాంశాలు...
అంతేకాదు నాలుగేళ్లుగా భాగస్వామ్య పార్టీగా ఉన్న బిజెపి చేసిన అన్యాయం...అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి చేస్తున్నతప్పుడు ప్రచారంపైనా ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. వీటితోపాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సంస్కరణలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ ప్రాంతాల్లో సంస్కరణలు, పోలవరం, అమరావతిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
వేదిక...ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ఈ ఏడాది కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. మూడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుండి సుమారు 30 వేలమంది ప్రతినిధులు హాజరవుతారని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా సిద్దార్ధ కళాశాల గ్రౌండ్లో వేదికను సిద్ధం చేయడం జరిగింది. ప్రత్యేకించి తెలంగాణా నుండి ఒక స్పెషల్ ట్రెయిన్ లో టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చేలా ఏర్పాటు చేశారట.
పార్కింగ్...కార్యక్రమాలు
ఈ కార్యక్రమానికి వచ్చేవారి కోసం 12 ఎకరాల్లో పార్కింగు ఏర్పాటు చేశారు. అదనంగా అవసరమైతే మరో ఎనిమిది ఎకరాల స్థలాన్ని సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా ఈ సమావేశానికి వేల సంఖ్యలో వాహనాలు తరలి వచ్చే అవకాశం ఉండటం తో ముందు జాగ్రత్తచర్యగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ను మళ్లించారు. ఇక మహానాడు ప్రారంభోత్సవంలో భాగంగానే ఫొటోఎగ్జిబిషన్, రక్తదానశిబిరం నిర్వహిస్తారని తెలిసింది. సమావేళాల ఆసాంతం వీలువెంబడి సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మహానాడులో రెండోరోజు ఎన్టీఆర్ జయంతి, విగ్రహావిష్కరణ ఉంటాయి. మూడోరోజు రాజకీయ తీర్మానంతో మహానాడు ముగుస్తుంది.
దశ...దిశ...ఉద్భోధ
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయాత్తం చేయడమే లక్ష్యంగా ఈ మహానాడు నిర్వహణ కొనసాగుతుందని టిడిపి మంత్రులు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి,కాల్వ శ్రీనివాసులు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలిపారు. 2019లో మళ్లీ టిడిపి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను గురించి పార్టీ శ్రేణులకు వివరించడం జరుగుతుందన్నారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తున్న వైనాన్ని కార్యకర్తలకు అర్ధమయ్యే విధంగా వివరించడం జరుగుతుందన్నారు. మహానాడు అంటేనే టిడి పి కార్యకర్తలకు పండుగ అని అన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రా లను బలహీనం చేయాలనే ఆలోచనతో మోడీ దుర్మార్గపు పాలన చేస్తున్నారని మంత్రులు చెప్పారు.