టిడిపి మహానాడు...వేల టన్నుల ఎసి కుమ్మరింత:అందుకే అంత "చల్లగా"!
విజయవాడ:అసలే బెజవాడ...అందులోనూ వేసవికాలం...పైగా రోహిణీ కార్తె...ఇక ఎండలు మామూలుగా ఉంటాయా?...మరోవైపు చూస్తే అసలే టిడిపి...అందులోనూ మహానాడు...పైగా వేలల్లో తరలివచ్చిన కార్యకర్తలు...ఆపైన రాజకీయ ప్రసంగాల తాకిడి...ఇక అక్కడ వేడి ఎలా ఉంటుంది?...ఒక్కమాటలో చెప్పాలంటే పేలిపోతుంది!...
Recommended Video
మరి అంత వేడిలో గంటలు గంటలు కూర్చోవాలనే కష్టం...అలాంటి పూటలు పూటలు...రోజులు రోజులు కూర్చోవాలంటే మామూలుగా అయ్యే పనేనా?...అందుకే నిర్వాహకులు దీనికో చక్కటి పథకం రచించారు. దాని ప్రకారం ప్రాంగణం అంతా చల్లదనం నింపేశారు. అందుకోసం వేల టన్నుల ఎసి కుమ్మరించారు. ఖర్చు తడిసి మోపిడవుతుందని తెలిసినా కార్యక్రమానికి హాజరైన నేతలు-కార్యకర్తలు చల్లగా ఉంటే చాలనుకున్నారు. అనుకున్నట్లే అందర్నీ మండువేసివిలో కూడా కూల్ కూల్ గా కూర్చోబెట్టి కార్యక్రమం కాగానే చల్లగా పంపించేశారు.
వేసవిలో...రాజకీయ వేడి
తేదీలు:మే 27,28,29...ఊరు:విజయవాడ...స్థలం:వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణం...కార్యక్రమం:టిడిపి మహానాడు...తెలుగుదేశం పార్టీ పండుగగా భావించే ఈ మూడు రోజుల వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టిడిపి కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపి పంపేందుకుగాను ముఖ్య ప్రసంగాల పరంపర కొనసాగించాల్సి ఉండగా...కార్యకర్తలు గంటల తరబడి ప్రాంగణంలో కదలకుండా కూర్చుని ఆ నేతల ప్రసంగాలు వింటూ ఎండ తాకిడిని తట్టుకోవాలి.
"అంత చల్లగా"..."అంతా చల్లగా"...
అందుకోసమే నేతల ప్రసంగాలు సాగే ప్రధాన వేదికతోపాటు కార్యకర్తలు కూర్చునే గ్యాలరీలు చల్లగా ఉంచాలని మహానాడు నిర్వాహకులు ముందే నిర్ణయించారు. అంతేకాదు...ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బ్లడ్బ్యాంక్, దాని చెంతనే ఉన్న మీడియా సెంటర్ను కూడా కూల్ చేయాలనుకున్నారు. ఆ విధంగా టిడిపి మహానాడు 2018కు హాజరయ్యే అందరూ రాజకీయ వేడితో రగిలిపోవాలే తప్ప ఎండ వేడిమి ప్రభావం అనేది వారిమీద ఉండకూడదని డిసైడ్ చేశారు.
వేల టన్నుల ఎసి...కుమ్మరించారు
అందుకే ప్రాంగణంలోని ప్రతి ప్రదేశం చల్లదనంతో నిండిపోయేలాగా వేలాది టన్నుల ఎసి కుమ్మరించారు. అందుకోసం రోజుకు 2600 టన్నుల ఏసీని వినియోగించారు. ఈ బాధ్యతలను విజయవాడ సీ 2 జంబో ఏసీ ఎయిర్ కూలర్స్ సంస్థ తమ మరో బ్రాంచ్ బెంగళూరుకు చెందిన సీ2 జంబో ఎయిర్ కూలర్స్ సంస్థతో కలసి విజయవంతంగా నిర్వహించింది. మహానాడులో మొత్తం 300 సీ2 ఐస్ జంబో కూలింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. వాటిని చల్లగాలి రావడానికి ఆరు చిల్లార్ ప్లాంట్లను నెలకొల్పారు.
ఎసిల పనికి...జనరేటర్ల తోడ్పాటు
300 సీ2 ఐస్ జంబో కూలింగ్ మిషన్లు నిరంతరాయంగా పనిచేసేందుకు రెండు 1250 కేవీ, రెండు 1000కేవీ, మరో రెండు 600కేవీ జనరేట్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎప్పటికప్పుడు చిల్లార్ ప్లాంట్లలో ట్యాంకర్ల ద్వారా నీరు పోయించేవారు. అది ఈ 300 మిషన్ల లోపల నీటిని నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూల్ చేసి...అనంతరం పైపులైన్ ద్వారా ప్రాంగణంలోకి పంపుతుంది. ఇప్పటివరకు ఈ సంస్థలు ఏపీలోని అన్ని పెద్ద బస్టాండ్లు, ఆలయాలు,ఫంక్షన్లు...ఈవెంట్లలో కూలర్స్ ఏర్పాటు చేస్తుండగా భారీ ఔట్డోర్ ఈవెంట్ కు ఈ తరహా ఏర్పాట్లు చేయడం మాత్రం ఇదే ప్రప్రథమం కావడం విశేషం.
సంతృప్తి: 80 నుంచి 87 శాతం
నవ్యాంధ్ర రాజధానిలో తొలిసారి టిడిపి మహానాడు నిర్వహించిన తీరుపై హాజరైనవారందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో 80 శాతానికి పైగా సంతృప్తి వ్యక్తం అయినట్లుగా సిఎం చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. తొలి రెండు రోజుల్లో వచ్చిన అభిప్రాయాలను మంగళవవారం ఆయన తెలియచేశారు. ప్రాంగణంలో ఏర్పాట్లపై తొలి రోజు 82 శాతం, రెండో రోజు 84 శాతం సంతృప్తి వ్యక్తం అయిందట. అల్పాహారంపై 80 శాతం, మద్యాహ్న భోజనంపై 82 శాతం, సభ నిర్వహణపై 87 శాతం, తాగునీటి సదుపాయంపై 88 శాతం, సాంస్కృతిక కార్యక్రమాలపై నిర్వహణపై 81 శాతం, పార్టీ సభ్యత్వం నమోదుపై 84 శాతం సంతృప్తి నమోదైనట్లు సిఎం వెల్లడించారు.