‘జేసీ! నల్ల అద్దాలు తీసెయ్, రాజకీయాలకు గుడ్బై చెప్పు’: టీడీపీ మేయర్ తీవ్ర వ్యాఖ్యలు
అనంతపురం: జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలు మరోసారి వెలుగుచూశాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం మేయర్ స్వరూప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడని అన్నారు.
వందకోట్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా.. నల్ల అద్దాలు పెట్టుకున్న దివాకర్ రెడ్డికి అవి కనిపించడం లేదని అన్నారు. ఆ నల్ల కళ్లద్దాలు తీసి.. తెల్ల అద్దాలు పెట్టుకోవాలని సూచించారు. బుధవారం స్వరూప మీడియాతో మాట్లాడారు.
కన్నెత్తి కూడా చూడరు
అనంతపురానికి చుట్టపు చూపుగా మూడు నెలలకు ఒకసారి వచ్చే జేసీ దివాకర్ రెడ్డికి.. తాము చేసిన అభివృద్ధి పనులను కన్నెత్తి కూడా చూకుండా విమర్శలు చేస్తున్నారని మేయర్ స్వరూప మండిపడ్డారు.
రాజకీయాల నుంచి తప్పుకో..
జేసీ దివాకర్ రెడ్డి కేవలం తిలక్ రోడ్, సూర్యనగర్ వంక వైపు మాత్రమే చూస్తున్నారని మేయర్ స్వరూప ఎద్దేవా చేశారు. అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి.. నగర అభివృద్ధికి అర్ధరూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధికి అడ్డుపడకుండా, మంచి పనులు చేసి రాజకీయాలను తప్పుకుంటే మంచిదని హితవు పలికారు.
ప్రజల ఆహ్లాదం కోసం
కాగా, ఇటీవల మేయర్ స్వరూప మాట్లాడుతూ.. అనంతపురం నగర ప్రజలకు ఆహ్లాదాన్ని.. ఆరోగ్యాన్ని పెంపొందించడానికే ఉద్యానవనాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అందులో భాగంగా గత గురువారం నగర కమీషనర్ పివీవీఎస్ మూర్తితో కలసి స్థానిక హౌసింగ్ బోర్డ్ లోని రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్, ఆదర్శ నగర్ లోని బుద్ధవిహార్ పార్కులలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా రాజీవ్ పార్కులో చిన్నారుల తల్లితండ్రులు అభ్యర్థన మేరకు తైక్వాండో కరాటే శిక్షణకై మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించడంలో భాగంగా శిక్షణ పరికరాలను పంపిణీ చేశారు. కరాటే క్రీడపై ఆసక్తి ఉన్న పేద పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని శిక్షకుడు రామ్ కి సూచించారు.
అభివృద్ధి పనుల పరిశీలన
అనంతరం పెండింగ్లో ఉన్న ఓపెన్ జిమ్ పనులు 3 రోజులలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత బుద్ధవిహార్ పార్క్ ను పరిశీలించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి సంక్రాంతి పండుగలోపు ఉద్యానవనం అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే పార్కు ముందు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద టెండర్ పూర్తి అయిన రూ.22లక్షల వ్యయం గల సీసీ రోడ్డు పనులను తక్షణం ప్రారంభించాలన్నారు. నగరాభివృద్ధిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఉద్యానవనాలను స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పార్కులలో మగ వారికి, మహిళలకు వేరువేరుగా వ్యాయామ శాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.