చంద్రబాబు పాపాల చిట్టా మా దగ్గరుంది... బయటపెడతాం: జీవీఎల్ నరసింహరావు
కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వారికి ముచ్చెమటలు పట్టిస్తున్న బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి టీడీపీపై నిప్పులు చెరిగారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సభను అడ్డుకునే ప్రయత్నాలు టీడీపీ చేస్తోందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోందని ఆయన ఫైర్ అయ్యారు. టీడీపీ ఏదో పొడిచేస్తాం అని విర్రవీగుతున్నారని వారి బెదిరింపులు తాటాకు చప్పుల్లేనని నరసింహారావు తేల్చి పారేశారు.
టీడీపీ అంటే టోటల్ డ్రామా పార్టీ అని నరసింహారావు కొత్త అర్థం ఇచ్చారు. దొంగ దీక్షలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం వారి మూర్ఖత్వం అవుతుందని మండిపడ్డారు. ఇప్పటికే వారి దొంగదీక్షలను ఎండగట్టినట్లు నరసింహారావు వివరించారు. ప్రజలముందే వారి దొంగదీక్షలను చూపించామని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూ అంతా తామే చేసినట్లు చెప్పుకోవడం టీడీపీకే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు. ఓవైపు స్పెషల్ ప్యాకేజీలను తీసుకుంటూనే మరోవైపు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని చెప్పిన నరసింహారావు... రెండేళ్ల క్రితం ఇదే డ్రామాల పార్టీ ప్యాకేజీ అద్భుతం అని పొగిడిందని గుర్తుచేశారు. ఇప్పుడు మరో కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. రంగస్థలంను బట్టి డ్రామాలు మారుస్తున్నారని నరసింహారావు ఫైర్ అయ్యారు.
పటేల్ విగ్రహం ఏర్పాటు, దోలేరా విషయంలో ప్రజలకు తప్పుడు సమాచారంను చేరవేస్తున్నారని టీడీపీ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు నరసింహారావు. తెలుగుదేశం డ్రామాలను పార్లమెంట్ సాక్షిగా ఎండగడతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న పాపానికి 1500 రోజులుగా మిమ్మల్ని భరిస్తున్నారని చెప్పిన నరసింహారావు... కేంద్ర పథకాలకు కూడా పచ్చ బ్రాండ్ వేస్తున్నారని విమర్శించారు. పోలవరంకు వారం వారం వెళ్లి ఏమి సాధిస్తున్నారని ప్రశ్నించారు. పోలవరానికి ఏమి చేయని మీరు... ఇప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీపై డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. కడపకు స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంటున్నది తెలుగుదేశమేనని నరసింహారావు కుండబద్దలు కొట్టారు.
సాగరమాల ప్రాజెక్టు కింద రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని గుర్తు చేసిన నరసింహారావు... ప్రచారం కోసం గడ్కరీ చుట్టూ తిరిగారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర అభివృద్ధి కోసం వెనక్కు తిరిగి చూస్తే మోడీ కనిపిస్తున్నారు కానీ... బాబు కనిపించడం లేదన్నారు. మళ్లీ తెలుగుదేశం గెలవడమనేది అసాధ్యమని జోస్యం చెప్పిన నరసింహారావు... సీఎం చంద్రబాబు పాపాల చిట్టా తమ దగ్గరుందని వ్యాఖ్యానించారు. ప్రజల ముందు టీడీపీ బాగోతాలు బయటపెడుతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. టీడీపీకి ఎంతమాత్రం విశ్వసనీయత లేదని మండిపడ్డ నరసింహారావు... రాష్ట్రంలో ప్రజలు ఛీకొట్టే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. టీడీపీ అవిశ్వాసం పెడితే తాము చర్చకు సిద్ధమని చెప్పారు. అయితే సభ సజావుగా సాగేందుకు అందరి సహకారం అవసరమన్నారు.